సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రవాణా శాఖపై కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ఎప్పటిలాగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ ఆదాయం సమకూరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3,966 కోట్లు సమకూర్చి గ్రేటర్ జిల్లాలు సత్తా చాటాయి. గతంలో ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మొదటిసారిగా వెయ్యి కోట్లు దాటి చరిత్ర సృష్టించాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,266.79 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,966.17 కోట్లు ఆర్టీఏ ఖాతాలో జమ కావడం విశేషం. అంతేకాదు రాష్ట్రం మొత్తం టార్గెట్ రూ.4,953 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.6,247 కోట్లు రాష్ట్ర రవాణా ఖాతాలో జమ అయింది. అయితే ఇందులో సింహ భాగం గ్రేటర్ జిల్లాలదే కావడం విశేషం. గత ఏడాది మూడు జిల్లాలు కలిపి 1,967 కోట్లు సమకూర్చగా ఈ సారి రెట్టింపు ఆదాయం సమకూర్చి మొదటి స్థానంలో నిలిచాయి.
ఆన్లైన్ సేవలు అదుర్స్..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వాహనాలు 80 లక్షలకు మించి ఉన్నాయి. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులకు సేవలందించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ సేవలను ఆన్లైన్ చేసింది. లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పర్మిట్, కండక్టర్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ట్యాక్స్, ట్రేడ్ సర్టిఫికెట్, రికమెండేషన్ లెటర్ వంటి సేవలన్నీ ఆన్లైన్ చేయడంతో వాహనదారులు ఆర్టీఏ సేవలను విరివిగా వినియోగించుకున్నారు.
రంగారెడ్డి టాప్..!
ఈ సారి 1499.47 కోట్లతో రంగారెడ్డి తన మార్కును చాటుకుంది. ఎప్పటిలాగే ప్రతి ఆర్థిక సంవత్సరం రంగారెడ్డి జిల్లానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచింది.రెండోస్థానంలో హైదరాబాద్ 1295.92 కోట్లు సమకూర్చగా… మేడ్చల్ జిల్లా 1170.78 కోట్లు రాబట్టింది. ఈ సారి మూడు జిల్లాలు వెయ్యి కోట్ల మార్కు దాటడం గొప్ప విషయమని అధికారులు వివరించారు. వాహనాల త్రైమాసిక పన్ను, లైఫ్ట్యాక్స్, ఫీజులు, యూజర్ చార్జీలు, డిటెక్షన్ వంటి వసూళ్ల ద్వారా రవాణాశాఖకు ఈ ఆదాయం సమకూరింది. గత ఏడాది 700 కోట్లతో రంగారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు 2021-22కి మూడు జిల్లాలు కలిపి 1,967 కోట్లు సమకూర్చగా… 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ రవాణా ఆదాయం రూ.1,776.05 కోట్లు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఆదాయం సమకూర్చిన జిల్లా రంగారెడ్డి కావడం విశేషం.
వెయ్యి కోట్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి
ఇప్పటి వరకు వెయ్యి కోట్లు దాటిన దాఖలాలు లేవు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వెయ్యి కోట్లు దాటడం గొప్ప విషయం. 14 వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను రీచ్ అవడమే కాకుండా అధిక మొత్తంలో ఆదాయం వచ్చేలా సరైన కార్యాచరణను అవలంభించాం. అధికారులు, సిబ్బంది చాలా బాగా పనిచేశారు.
– ప్రవీణ్ రావు, డీటీసీ, రంగారెడ్డి