బంజారాహిల్స్, డిసెంబర్ 8: డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా.. డబ్బులివ్వకుంటే రేప్ కేసులు పెట్టిస్తాం.. మంచిగ చెబుతున్నాం.. డబ్బులివ్వండి.. అంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు లాక్కున్న నలుగురు ట్రాన్స్జెండర్లతోపాటు వారికి సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఏజెన్సీస్కు సంబంధించిన ఐస్క్రీమ్ స్టోర్ వద్దకు గత నెల 26న ఎనిమిది మంది ట్రాన్స్జెండర్లు వచ్చారు. తమకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. స్టోర్ ప్రారంభ సమయంలో వేలాది రూపాయలు ఇచ్చాం.. రోజుకో గ్యాంగ్ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే ఎలా అంటూ నిర్వాహకులు ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వాల్సిందే.. లేకుంటే మీ షాపులో పనిచేస్తున్న వారిపై రేప్ కేసులు పెట్టిస్తాం.. అంటూ బెదిరించడంతో పాటు మీ అంతుచూస్తామని హెచ్చరించారు.
వారి మాటలతో భయాందోళనకు గురైన స్టోర్ సిబ్బంది.. టాన్స్జెండర్స్కు రూ.10 వేలు ఇచ్చారు. జరిగిన సంఘటనను స్టోర్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టోర్ నిర్వాహకుడు సురేశ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజీని పరిశీలించారు.
బెదిరింపులకు పాల్పడిన వికారాబాద్ జిల్లా గరీబ్నగర్కు చెందిన సభ అలియాస్ సలీమ్ వాజిద్(38), మైలార్దేవ్పల్లికి చెందిన ఖుషీ అలియాస్ సయ్యద్ సమీర్(41), బంజారాహిల్స్లోని ఇందిరానగర్కు చెందిన మధు అలియాస్ మహ్మద్ మస్తాన్ అలీ(38), జల్పల్లికి చెందిన నూరీ అలియాస్ మహ్మద్ నూరీ (40)తో పాటు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లు పల్లెచెరువుకు చెందిన ఆర్.శ్రీకాంత్(23), హసన్నగర్కు చెందిన మహ్మద్ వాజీద్(32)పై ఐపీసీ 448, 389 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గురువారం వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.