సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): పోలీసు ఉన్నతాధికారుల బదిలీలలో ప్రభుత్వం ‘తిక్క శంకరయ్య’లా వ్యవహరిస్తున్నదని పోలీసు వర్గాలలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పోలీసు ఉన్నతాధికారులను బదిలీలు చేశారు. అయితే, పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లోనే ఉన్నా.. నియమ నిబంధనల గూర్చి కనీసం అవగాహన లేకుండా.. ఏ మాత్రం ముందుచూపు లేకుండా ఇష్టానుసారంగా బదిలీ చేశారు. తీరా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుండటంతో అధికారులను మారుస్తూ వస్తున్నారు. ఆయా విభాగాలపై పట్టుసాధిస్తున్న క్రమంలో ఒక్కో అధికారిని తమ ఇష్టానుసారంగా మారుస్తుండటంతో డిపార్టుమెంట్లో ఏమి జరుగుతుందో పోలీసులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది.
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే నియమించింది. ఆయన కమిషనరేట్పై పట్టుసాధిస్తున్న క్రమంలోనే బదిలీ చేశారు. గతంలో ఇదే కమిషనరేట్లో జాయింట్ సీపీగా పనిచేయడం, తిరిగి అదే కమిషనరేట్కు కమిషనర్గా వెళ్లడంతో గత పార్లమెంట్ ఎన్నికలకు, ఈ పార్లమెంట్ ఎన్నికలకు మధ్య మూడేండ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసినట్లు తేలింది. ఈ సాంకేతిక కారణంతో ఆయనను బదిలీ చేసినట్లు సమాచారం.
తాజాగా.. హైదరాబాద్ నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ను బదిలీ చేశారు. ఆయన స్థానికుడని, అందుకే హైదరాబాదేతర ప్రాంతానికి బదిలీ చేయాలనే నిబంధన మేరకు వరంగల్ ఐజీగా బదిలీ చేసినట్లు సమాచారం. అలాగే, ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ను కూడా బదిలీ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్కు గుండెకాయలాంటి క్రైమ్, ట్రాఫిక్ విభాగాధిపతులిద్దరినీ బదిలీ చేయడం గమనార్హం. ఈ ఇద్దరు అధికారులు తమ విభాగాలపై పట్టు సాధించారు. సీసీఎస్ ప్రక్షాళనతో పాటు సైబర్నేరాల కట్టడికి, దర్యాప్తులో తగిన ప్రణాళికలు రూపొందించి.. సిబ్బందికి రంగనాథ్ దిశా నిర్దేశం చేశారు. అలాగే, నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా పకడ్బందీగా సిబ్బందిని ట్రాక్లోకి తీసుకురావడంలో విశ్వప్రసాద్ ప్రయత్నిస్తూ.. ఫలితాలు రాబడుతున్నారు.
సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న శరత్ చంద్ర పవార్ను నార్కోటిక్ బ్యూరోకు బదిలీ చేశారు. ఈ అధికారిని కూడా హైదరాబాద్ స్థానికతకు సంబంధించిన అంశంలోనే బదిలీ చేశారు. కీలకమైన సెంట్రల్ జోన్పై శరత్ చంద్ర పూర్తి పట్టు సాధించారు. ఇంతలోనే ఆయన బదిలీ కావడంతో సిబ్బంది షాక్కు గురయ్యారు.
గతంలో పలువురు ఐపీఎస్, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను కూడా బదిలీ చేస్తూ, తిరిగి ఆ బదిలీలను రద్దు చేస్తూ.. మరో చోటకు బదిలీ చేస్తూ.. బదిలీల వ్యవహారాన్ని ఒక కిచిడిలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.