సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వచ్చే జరిమానాలు ఆదాయ వనరుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా 153 శాతం చలాన్ల రెవెన్యూను పెంచేశారని నివేదికలు చెబుతున్నాయి. జనవరి, 2025లో రూ. 108 కోట్లు చలాన్ల నుంచి ఆదాయం వస్తే..సంవత్సరం తిరిగే వరకు 2026 జనవరిలో రూ. 275 కోట్లకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 153 శాతం ఈ రెవెన్యూను ప్రభుత్వం పెంచుకున్నట్లు ప్రజలలో చర్చ జరుగుతున్నది.
ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో వాహనం బయటకు తీయాలంటే ఎక్కడ ఏ ట్రాఫిక్ పోలీసులు కెమెరాతో ఫొటో తీస్తాడోననే భయంలో నగర వాసులు ఉన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, అవగాహన కార్యక్రమాల కంటే చలాన్లు వేయడం, వసూళ్లు చేయడంపైనే పోలీసులు ఎక్కువ దృష్టి పెడుతున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ట్రాఫిక్ చలాన్లు అనేవి రోడ్డు భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధిస్తుంటారు. హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు చలాన వేస్తుంటారు. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ప్రజలలో విస్త్రతమైన అవగాహన కార్యక్రమాలు తరచూ జరుగుతుండాలి.
పాఠశాల స్థాయి నుంచి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తేవడం, తల్లిదండ్రులతో పాటు పిల్లల్లోనూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంపై చైతన్యం తీసుకొచ్చేలా అవగాహన కార్యక్రమాలు జరగాలి. కానీ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలను పక్కన పెట్టేశారని విమర్శలు వస్తున్నాయి. పేరుకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేస్తూ… ఆ విషయాన్ని ఇక క్షేత్ర స్థాయి అధికారులు పక్కన పెట్టేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు, ట్రాఫిక్ చలాన్లు వేయడమే తమ విధులు అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.