Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ సిగ్నల్స్ విద్యుత్ సరఫరా లేని సమయంలో బ్యాటరీ సపోర్టుతో పనిచేస్తాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే తిరిగి బ్యాటరీలు రీఛార్జి అవుతాయి. అయితే ఈ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్న ముఠాను ఆ సిగ్నల్స్ వద్ద ఉండే ఐటీఎంఎస్లోని ఏఎన్పీఆర్(ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) కెమెరాలు పట్టించాయి. సిగ్నల్స్తో పాటు ఐటీఎంఎస్ కెమెరాల కోసం ఈ బ్యాటరీలను నిర్వహణ సంస్థ వాడుతుంటుంది. నగర నడిబొడ్డున అర్ధరాత్రి సునాయసంగా బ్యాటరీలను ఈ ముఠా కొట్టేస్తుంది. కొట్టేసిన బ్యాటరీలను తక్కువ ధరకు తుక్కు దుకాణంలో బేరం పెట్టేస్తున్నారు. మూడు నెలల్లోనే ఈ ముఠా భారీగా దొంగతనాలు చేసింది. సిగ్నల్స్ బ్యాటరీలను అపహరిస్తున్న ముఠాను ఆదివారం అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
షేక్ అజీముద్దీన్, జంగాల మద్దిలేటీలకు గతంలో నేరచరిత్ర ఉంది. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న బ్యాటరీలను దొంగిలించాలని ప్లాన్ వేశారు. రెక్కీ నిర్వహించి, అర్ధరాత్రి సమయంలో ఆటోలో వచ్చి బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. ఒక్కో బ్యాటరీ రూ.10 వేల వరకు ఉంటుంది. ఇలా బేగంబజార్, కాచిగూడ, లంగర్హౌజ్, హబీబ్నగర్, గోపాలపురం, మలక్పేట్, షాహినాయత్గంజ్, సైఫాబాద్, చైతన్యపురి తదితర పోలీస్స్టేషన్ల పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్యాటరీలను ఈ ముఠా చోరీ చేసింది. బ్యాటరీల అపహరణపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒకే ఆటో ఆయా ప్రాంతాలలో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అబిడ్స్ పోలీసులకు ఆటో వివరాలను ట్రాఫిక్ పోలీసులు అందించడంతో, ఆటో బ్యాటరీ దొంగలను పట్టుకున్నారు. ఇదిలాఉండగా బ్యాటరీలు చోరీకి గురికాగానే నిర్వహణ సంస్థ ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఆలస్యంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే కేసులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తే దొంగలు మరింత ముందుగానే పట్టుబడే వారనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.