సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా మక్కా మసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, చార్మినార్, మదీనా, ముర్గీచౌక్, రాజేశ్మెడికల్ హాల్ శాలిబండ రూట్లను మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈ రూట్లలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రార్థనలకు వచ్చే వారి కోసం గుల్జార్ ఫంక్షన్హాల్, ముఫీద్ ఉల్ అనమ్ గ్రౌండ్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యూనాని హాస్పిటల్, కిల్వత్ గ్రౌండ్, ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, జీహెచ్ఎంసీ సర్దార్ మహాల్ ఆఫీస్ ప్రాంగణాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే సికింద్రాబాద్లో మహంకాళి పీఎస్, రాంగోపాల్పేట్ జంక్షన్ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉంటుందని, రోచబజార్ నుంచి రాణిగంజ్ వరకు ట్రాఫిక్ ఫ్రీఫ్లో ఉంటుందన్నారు.
చార్మినార్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను అఫ్జల్గంజ్ వరకే అనుమతిస్తారు. అలాగే ఎంజీబీఎస్ నుంచి నయాపూల్, మదినా మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులను చాంద్రాయణగుట్ట రోటరీ, నల్గొండ క్రాస్రోడ్, సైదాబాద్ టీ జంక్షన్, ఐఎస్ సదన్, మిథాని జంక్షన్, ఎంబీఎన్ఆర్ ఫ్లైవోవర్, బండ్లగూడ అరాంఘర్ వైపు వెళ్లాలని సూచించారు.
చార్మినార్, మక్కా మసీదు మార్గాల్లో వాహనాల మళ్లింపు చేపడుతున్నామని దక్షిణ మండల ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మక్కా మసీదులో నిర్వహించే ప్రార్థనల సందర్భంగా చార్మినార్ నుంచి మదీనా-చార్మినార్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని చెప్పారు. అఫ్జల్గంజ్ నుంచి మవీనా మీదుగా చార్మినార్కు వెళ్లాల్సిన వాహనాలు మదీనా క్రాస్ రోడ్డు నుంచి హైకోర్టు మార్గంలో సిటీ కాలేజీ మార్గంలో ప్రయాణించాలని సూచించారు.
పవిత్ర రంజాన్ మాసం చివరి రోజున నిర్వహించే ‘ఈద్-ఉల్-ఫితర్’కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వక్ఫ్బోర్డు చైర్మన్ మసీయుల్లా తెలిపారు. గురువారం ఆయన బహదూర్పుర ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్తో కలిసి మిరాలం ఈద్గాలో ‘ఈద్-ఉల్-ఫితర్’ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మసీయుల్లా మాట్లాడుతూ.. ‘ఈద్-ఉల్-ఫితర్’ పురస్కరించుకుని మిరాలం ఈద్గాలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు స్థాని ప్రాంతాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల వరకు ముస్లిం భక్తులు విచ్చేస్తారని అంచనా వేశామని, అందుకనుగుణంగా చలువ మండపాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మిరాలం ఈద్గా వద్ద నిర్వహించే క్యాంప్లో నగర సీపీ సీవీ ఆనంద్తోపాటు నగర పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ఏఈ విజయ్కుమార్, వాటర్వర్క్స్ మేనేజర్ కృష్ణ, అగ్నిమాపక శాఖాధికారులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.