సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈనెల 31న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు సైబరాబాద్ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్స్ను మూసివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే, ఓఆర్ఆర్ను సైతం మూసివేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలను మాత్రం అనుమతిస్తామన్నారు. రోడ్లపై న్యూసెన్స్కు పాల్పడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించినా, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైడ్ నిరాకరించినా చర్యలు..
క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అంతేకాకుండా.. ప్రజలు వాహనాన్ని బుక్ చేసుకున్న తర్వాత రైడ్ను నిరాకరించినా..! అధిక చార్జీలు డిమాండ్ చేసినా.! చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే వెంటనే 9490617346 నంబర్కు కాల్చేసి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.
వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం..
పబ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం సేవించిన వారు వాహనాలు డ్రైవింగ్ చేయకుండా సంబంధిత యాజమాన్యాలు/నిర్వాహకులు అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు. అంతేకాకుండా మద్యం సేవించిన వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాన్ని నిర్వాహకులే కల్పించాలని ఆదేశించారు.
ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్..
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, మొదటి సారి డీడీ కేసులో పట్టుబడితే రూ.10వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15వేల జరిమానా, రెండేండ్ల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఈ ఫ్లైఓవర్లు మూసివేత..
శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ-1, 2, షేక్పేట, మైండ్స్పేస్, రోడ్నం. 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్- జేఎన్టీయూ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్, బాలానగర్లోని బాబూ జగ్జీవన్రామ్ ఫ్లైఓవర్ మూసివేస్తారు.