హైదరాబాద్ : ట్యాంక్బండ్ వేదికగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఎస్ ఆర్టీసీ 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్తో పాటు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. అప్పర్ ట్యాంక్బండ్, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, లిబర్టీ, వీవీ విగ్రహాం జంక్షన్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
-రాణిగంజ్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను షైలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్స్, డీబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.
-లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్బండ్కు వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహాం వద్ద, తెలుగుతల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
-తెలుగు తల్లి జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్నగర్ వైపు మళ్లిస్తారు.
-ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు అనుమతి ఉండదు. ఈ వాహనాలను కవాడిగూడ క్రాస్ రోడ్స్ నుంచి లోయర్ ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తారు.
-డీబీఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు అనుమతి ఉండదు. డీబీఆర్ మిల్స్ నుంచి గోశాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్బండ్ వెళ్లాలి.
-ఆర్టీసి బస్సులు అప్పర్ ట్యాంక్బండ్ మీద నుంచి కాకుండా లోయర్ ట్యాంక్బండ్ నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.