నగరంలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను వెంటాడుతున్నది. నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు విసిగిపోతున్నారు. సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగంలోని ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నా… క్షేత్రస్థాయిలో పరిష్కార మార్గాలు అమలు కావడం లేదు. సమస్య తీవ్రత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట సీఎం రేవంత్ ట్రాఫిక్ సమస్యపై ఆరా తీశారు. అసలు ట్రాఫిక్ జామ్లు ఎందుకు అవుతున్నాయి? పరిష్కారాన్ని చూడండి… అని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు అనుగుణంగా ఇటీవల బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అధికారులతో చర్చించారు. తదనంతరం పలు రకాల చర్యలు అమలులో కనిపించాయి. సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధ సమయాన్ని పొడిగించారు. ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు ఉన్న సమయాన్ని పదకొండున్నర వరకు… సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది వరకు ఉంటే… పదిన్నర వరకు పొడిగించారు. దీంతో పాటు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం వల్ల సమస్య కొంతమేరకు తీరుతుందని ఆ మేరకు చర్యలు చేపట్టారు. అయినా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు.