బేగంపేట్, మార్చి 1: పరీక్ష రాసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి చికిత్స చేయించి.. పరీక్ష రాయించి.. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంటర్ పరీక్ష రాసేందుకు శుక్రవారం విద్యార్థిని భవానీ తన తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని తపస్య కాలేజీకి వెళ్తుండగా, ప్యారడైజ్ సీటీవో జంక్షన్ వద్ద బండి స్కిడ్ కావడంతో రోడ్డుపై పడిపోయి..గాయపడింది. తీవ్ర గాయాలతోనే పరీక్షా కేంద్రానికి వచ్చింది.
సమయం మించిపోతుండటంతో చేసేది లేక పరీక్ష రాస్తానని చెప్పింది. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పరీక్షా కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి..కొంత సమయం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆమెను తన వాహనంలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి తిరిగి పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. మానవత్వాన్ని చాటుకున్న ఉపాశంకర్కు భవాని కృతజ్ఞతలు చెప్పింది.