సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకూ జఠిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని సైబరాబాద్లో అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానానికి సంబంధించి సైబరాబాద్లోని స్థానిక భౌగోళిక పరిస్థితుల్లో సాధ్య, అసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని పీఎస్ ఐఓసీ, ఎస్సీ,ఎస్టీ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేశ్ .. ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్కుమార్తో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ట్రాఫిక్ జామ్కు గల కారణాలను ముందస్తుగానే అంచనా వేయడం, వాటి నివారణకు చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ జామ్ రహదారులను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం, వాహనాల రద్దీ ఆధారంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించడం, తదితర అంశాలపై చర్చించారు.
ట్రాఫిక్ రద్దీని ముందస్తుగానే అంచనావేయడంపై స్విట్జర్లాండ్లోని జ్యూరిక్కు చెందిన ట్రాన్స్ కాలిటీ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ మాట్లాడారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిషారాలను వివరిస్తూ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రాజధానిలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎకడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చని వివరించారు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా నియంత్రించి, వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చేయవచ్చని తెలిపారు.
అనంతరం సైబరాబాద్ సీపీ రమేశ్ మాట్లాడుతూ.. నగరంలో రాబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీలను వినియోగించడం వల్ల రోడ్డు భద్ర త మెరుగుపడటమే కాకుండా, సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డీసీపీలు టి. అన్నపూర్ణ, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్, ఆసి ప్రతినిధులు పాల్గొన్నారు.