మియాపూర్, ఏప్రిల్ 8: మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. నో ఎంట్రీ వాహనాలను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో కూకట్పల్లి భరత్ నగర్లో బియ్యం బస్తాలను అన్లోడ్ చేసిన ఓ లారీ.. మియాపూర్ వైపు అతివేగంగా వచ్చి ట్రాఫిక్ బూత్ను ఢీకొట్టింది. దీంతో అది అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పడింది.
హోంగార్డు సింహాచలం తలకు తీవ్రమైన గాయం కాగా, రాజవర్ధన్ కుడి చెయ్యి భుజంలో ఫ్రాక్చర్ అయింది. విజేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులను వైద్యం నిమిత్తం మదీనాగూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు హాస్పటల్కు తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. మిగిలిన ఇద్దరూ గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. లారీ డ్రైవర్ను సదాశివపేటకు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. నిర్లక్ష్యం, అతి అతివేగం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతుడు సింహాచలం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.