దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నగరం ముస్తాబైంది. ఈ ఆవిష్కరణ మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు 150 డివిజన్ల నుంచి భారీగా నేతలు తరలిరానున్నారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూల దండలు వేసి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి బైక్ ర్యాలీలతో చేరుకోనున్నారు. మరోవైపు నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ దంమల్కాపూర్లో డిక్కీ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)కి రెండు ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక దళిత పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రూ.562 కోట్ల రాయితీ చెక్కులను పంపిణీ చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అతిపెద్ద లోహ విగ్రహ ఆవిష్కరణకు నగరం ముస్తాబైంది. నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనమడు ప్రకాశ్ అంబేద్కర్లు ఆవిష్కరించనున్నారు. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిపేందుకు నగర బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ మేరకు 150 డివిజన్లలో ఉదయే ఆయా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూల దండ వేసి అక్కడి నుంచి భారీ విగ్రహావిష్కరణ జరిగే సభ ప్రాంగణానికి బైక్లతో ర్యాలీలుగా తరలివచ్చేలా ప్లాన్ చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాల ద్వారా కలిపి మొత్తంగా 2వేల చొప్పున 24 నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చేలా కార్యాచరణను రూపొందించారు. అంబేద్కర్ మహనీయుని జయంత్యుత్సవ వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరపన్నుట్లు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ సందర్భంగా తెలిపారు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే అమితమైన ప్రేమకి తార్కాణం 125 అడుగుల విగ్రహం అని, విగ్రహ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోపినాథ్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ తాను అనుకున్నది సాధించే ముఖ్యమంత్రి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్. ప్రభాకర్ రావు అన్నారు. గురువారం మెహిదీపట్నం గుడిమల్కాపూర్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ రిటైల్ కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ పార్టీ నగర మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు సి.సంజయ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీలు సీహెచ్. ఆనంద్కుమార్గౌడ్, జీవన్సింగ్, మాజీ కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, ఎ.కృష్ణ, డివిజన్ల అధ్యక్షుడు చెన్నబత్ని లక్ష్మీనారాయణ, కోడూరి శ్రీధర్ సాగర్, మహేందర్, తూంకుంట అరుణ్కుమార్, రాములు, భాస్కర్, ధరమ్వీర్, యాదయ్య, దీపక్, సత్యనారాయణ గౌడ్, విజయ్ పాల్గొన్నారు.
– మెహిదీపట్నం, ఏప్రిల్ 13
బేగంపేట్ ఏప్రిల్ 13: దేశంలోనే ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో నిమోజకవర్గం పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ దళితుల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, కొలన్ లక్ష్మీ బాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఉప్పల తరుణి, శేషుకుమారి నాయకులు శ్రీనివాస్గౌడ్, హన్మంతరావు, స్కైలాబ్, శ్రీహరి, నరేందర్రావు, శేఖర్ పాల్గొన్నారు.
కాచిగూడ, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేద్కర్ భవనంగా నామకరణ చేసి, నేడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండటం దేశానికే ఆదర్శం అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్బాబు అన్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భవనంగా నామకరణం చేసినందుకు రమేశ్బాబు ఆధ్వర్యంలో గురువారం హోం మంత్రి మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి తెలంగాణ మాల మహానాడు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రమేశ్బాబు మాట్లాడుతూ ఢిల్లీలోని నూతన పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సలహాదారు కొండ్రు రాజలింగం, కృష్ణమూర్తి, రేణుక, ఉదయ్, సత్యం, శ్రవణ్, రబ్బాని, తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్ : సబ్బండవర్ణాల అభ్యున్నతికి నాడు డాక్టర్ బీఆర్ అంబేదర్ రాజ్యాంగాన్ని రచించారని, నేడు సమస్త వర్గాల సమగ్రాభివృద్ధికి పాటుపడుతూ.. అభినవ అంబేదర్గా సీఎం కేసీఆర్ నిలిచారని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేదర్ కాంస్య విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురసరించుకుని నాగోల్ డివిజన్ పరిధి కో ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని చదవాలని సూచించారు. ప్రపంచానికి ఆదర్శవంతమైన భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్ కాంస్య విగ్రహం ఒకవైపు, దేశానికే తలమానికమైన డాక్టర్ బీఆర్ అంబేదర్ రాష్ట్ర సచివాలయం మరోవైపు, తెలంగాణ సాధనలో అమరుల స్మారకజ్యోతి ఇంకోవైపు ఏర్పాటు చేసిన కేసీఆర్ దృక్పథానికి జనం జేజేలు పలుకుతున్నారన్నారు.
ముషీరాబాద్, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ సాహిత్యం, సిద్ధాంతాలు ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగా నిలిచాయని తెలంగాణ మాజీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బుద్ధా మురళి అన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గం ప్రజలకు చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు ఆదర్శమూర్తి అని స్పష్టం చేశారు. చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో జరుగుతున్న శతాబ్ది పూర్వ మహనీయుల యాదిలో భాగంగా గురువారం అంబేద్కర్ జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో చిన్న రాష్ర్టాల ఆవశ్యకతను పొందుపర్చడం వంటి అంశాలు తెలంగాణ ఏర్పాటుకు దోహదపడిండన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి, డాక్టర్ జి.మాస్టర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ జిల్లా జడ్జి కుశ, నాలుగవ అదనపు జిల్లా జడ్జి హేమంత్ కుమార్, జిల్లా జడ్జి జయకుమార్, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్, తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరఫున జడ్జీలను శాలువాలతో సన్మానించారు.
దేశంలో మత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరుగబోయే సమరాలకు 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహం స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రముఖ కవులు, రచయితలు తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ కార్యాలయంలో వనపట్ల సుబ్బయ్య రాసిన మా ఆక్షరం, ఆయుధం, అంబేద్కర్ అన్న దీర్ఘకవితను జూలూరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, భాషా సాంస్కృతి సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, జూపాక సుభద్ర, కోయి కోటేశ్వరరావు, రాపోలు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -రవీంద్రభారతి, ఏప్రిల్ 13