సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా అన్ని సదుపాయాలతో ఇండ్లు నిర్మించినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం నాడు తొలి విడతగా 11,700 ఇండ్లను పంపిణీ చేస్తున్నామని, గ్రేటర్ పరిధిలోని 9 ప్రాంతాల్లో మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇండ్లు అందించనున్నామని చెప్పారు. కాగా, శనివారం కొల్లూర్-1(పటాన్చెరు)లో మంత్రి హరీశ్రావు , బహదూర్పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మంకాల్-1లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, బండ్లగూడ, ఫరూక్నగర్లో మంత్రి మహమూద్ అలీ, అహ్మద్గూడలో మంత్రి మల్లారెడ్డి, కర్దనూర్-2(పటాన్చెరు)లో మంత్రి మహేందర్రెడ్డి, శ్రీరాంనగర్లో మేయర్ విజయలక్ష్మి, ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు.
దశల వారీగా అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, పలు దఫాల పరిశీలన తర్వాతనే అర్హులను ప్రకటన చేశామని, దశల వారీగా గ్రేటర్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. శనివారం జరిగే ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తోపాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని 9 ప్రాంతాల్లో మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి 24 నియోజకవర్గాల్లో ఇండ్ల పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు.
పారదర్శకంగా అర్హుల ఎంపిక..
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సకల సదుపాయాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లకు 7లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 95వేల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించామని, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా అన్ని సదుపాయాలతో ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం, ఎంపిక, పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మాజీ గవర్నర్ నరసింహన్ పరిశీలించి ఢిల్లీలోని ఐఏఎస్ భవనాలతో పోలినట్లుగా ఉన్నాయని కితాబు ఇచ్చిన విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు.
దశల వారీగా ఇండ్ల పంపిణీ
దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. తొలి దఫా 11,700 ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను 10 లేదా 15 రోజులకోసారి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.ఆ తర్వాత గృహలక్ష్మి పథకం కింద పేదవారికి ఇంటి నిర్మాణంలో సాయం అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తున్నట్లుగా చెప్పారు. తొలి దశలో ఇండ్లు రాలేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులను సమావేశ వేదికల వద్దకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, నోడల్ ఆఫీసర్లు సమన్వయం చేస్తున్నారని వివరించారు. గతంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు అందజేసినట్లుగా తెలిపారు. మంజూరు పత్రాలను అందుకున్న లబ్ధిదారులు ఎప్పుడైనా గృహప్రవేశం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రారంభం కానున్న డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహుదూర్పల్లి, మేడ్చల్లోని అహ్మద్నగర్, ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారం, ఉప్పల్ నియోజకవర్గంలోని శ్రీరాంనగర్లో ఏర్పాట్లు పూర్తిచేశారు.
విజయవంతం చేయాలి : కలెక్టర్ అనుదీప్
జిల్లాలో ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు జరుగుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మొత్తం 24 నియోజక వర్గాలకు సంబంధించిన పలు ప్రాంతాలలో ర్యాండమైజేషన్ ఇండ్ల కేటాయింపు ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని జిల్లా అధికారులు విజయవంతం చేయాలని అదేశించారు. ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన జాబితాల వారీగా లబ్ధిదారులకు ఇండ్లు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్లో డబుల్ ఇండ్ల పంపిణీ వేదికల వివరాలు