హైదరాబాద్ : హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభయాత్రకు 8 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం సీపీ పరిశీలించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శోభాయాత్ర కొనసాగే దారిలో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు 12 కిలోమీటర్లు, కర్మాన్ఘాట్ నుంచి కోఠి మీదుగా 10 కిలోమీటర్ల మేర మరోయాత్ర కొనసాగనుంది. కోఠిలో ఈ రెండు శోభాయాత్రలు కలుసుకోనున్నాయి.
గౌలిగూడ రామ్ మందిర్ వద్ద హనుమాన్ శోభాయాత్ర ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. పుత్లిబౌలీ ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్, రామ్ కోఠి ఎక్స్ రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్ టీ జంక్షన్, కవాడిగూడ ఎక్స్ రోడ్, సీజీవో టవర్స్, ఆర్పీ రోడ్, ఓల్డ్ పీఎస్ రామ్గోపాల్ పేట్, పారడైజ్ జంక్షన్, సీటీవో, బ్రూక్ బాండ్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బన్ హనుమాన్ మందిర్ వద్దకు రాత్రి 8 గంటలకు చేరుకోనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు.