మైలార్దేవ్పల్లి, జూన్ 11: ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు చక్రాలు వెళ్లడంతో చికిత్స పొందుతూ మృ తి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో స్ధానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పల్లె చెరువు ప్రాంతంలో గోబింద్రామ్, సోమరి దేవిలు నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు షియంకుమార్ (3) బుధవారం సాయంత్రం ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో స్థానిక విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీకి చెందిన కారు( డ్రైవర్ అరవింద్ ) ఒక్కసారిగా దూసుకొచ్చి బాలుడిపైకి వచ్చింది.
కారు చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందు తూ గురువారం ఉదయం బాలుడు మృతి చెందాడు. బాలుడు కళ్ల ముందే శవమై పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలుడి మృతికి విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, స్ధానికులు పెద్ద ఎత్తున కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగారు.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్తో పాటు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి, వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.