Drugs | సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్లో విక్రయిస్తున్న మూడు వేర్వేరు ముఠాలను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ వివరాలను వెల్లడించారు. బీహార్కు చెందిన లాల్బాబు కుమార్ హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చి, సైదాబాద్లోని ఓ డీజే సౌండ్ సిస్టమ్ దుకాణంలో పదేండ్లుగా పనిచేయగా.. వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో బీహార్లో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్కు తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించాడు. తనతో పనిచేసే మహ్మద్ ముస్తాఖ్ సహకారం తీసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల బీహార్కు వెళ్లి అక్కడ పప్పు కోశ్వ, అస్లాం వద్ద నుంచి రూ.5 వేలకు ఒక గ్రామ్ చొప్పున 24 గ్రాముల హెరాయిన్ కొనుగోలుచేసి నగరానికి వచ్చారు. బాలాపూర్లో ఒక్కో గ్రామ్ రూ. 10 వేలకు విక్రయించేందుకు ప్రయత్నించగా.. స్థానిక పోలీసులతో కలిసి ఎస్ఓటీ పోలీసులు లాల్ బాబుకుమార్, మహ్మద్ ముస్తాఖ్ను అరెస్టు చేశారు.
రాజస్థాన్కు చెందిన అగ్రివత్ సంతోష్ దాస్, శివ స్నేహితులు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి.. కార్పెంటర్గా పనిచేశారు.
మధ్యప్రదేశ్కు చెందిన ట్రక్ డ్రైవర్ లోకేశ్ వద్ద నుంచి 1.5 కిలోల ఓపియం డ్రగ్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చారు. మీర్పేట ప్రాంతంలో డ్రగ్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. స్థానిక పోలీసులతో కలిసి ఎస్ఓటీ పోలీసులు నిందితుడు అగ్రివత్ సంతోష్దాస్ను అరెస్ట్ చేశారు. మిగితా నిందితులు శివ, లోకేశ్ పరారీలో ఉన్నారు.
చౌటుప్పల్, ఎల్బీనగర్ పోలీసులు కలిసి చౌటుప్పల్ వద్ద కంటైనర్ను తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి. జైకిసాన్, హనుమ రామ్, రాజురామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల వద్ద నుంచి 5 కిలోల పప్పీ స్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా.. హయత్నగర్లో మోతీలాల్ బాలాజీ సింగ్ తన బైక్పై గంజాయి రవాణా చేస్తున్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.