చార్మినార్, సెప్టెంబర్ 14: ఇద్దరూ ప్రేమించుకొని పదేండ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు బాగున్నారు. మద్యంకు బానిసైన భర్త నుంచి ఆమెకు నిత్యం వేధింపులు తప్పడంలేదు. ఎలాగైనా సోదరి సమస్యను దూరం చేయాలనుకున్న ఆమె సోదరుడు బావను హత్యచేశాడు. బహదూర్పుర ఫిల్టర్ వద్ద ఇటీవల జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసులోని నిందితులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ కథనం ప్రకారం.. తాడ్బన్ ప్రాంతానికి చెందిన దస్తగిరి, సయిదాబేగం దంపతులు. సయిదాబేగం సోదరుడు సయ్యద్ ఇలియాసుద్దీన్ అలియాస్ ఇలియాస్ ఖాద్రీ అలియాస్ ఇలియాస్ ఉద్దీన్ (32). దస్తగిరి పెండ్లి అయిన కొద్ది రోజుల నుంచే భార్యను వేధిస్తున్నాడు.
మద్యంకు బానిసైన అతడు నిత్యం భార్యతో గొడవ పడుతున్నాడు. పద్ధతి మార్చుకోవాలని అనేకసార్లు హెచ్చరించినా దస్తగిరి తన ధోరణిని మార్చుకోలేదు. రోజురోజుకూ దస్తగిరి వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో దస్తగిరిని హత్య చేస్తేనే తన సోదరికి విముక్తి కలుగుతుందని సయ్యద్ ఇలియాస్ ఉద్దీన్ భావించాడు. తన స్నేహితులకు విషయం చెప్పి, సహకరించాలని కోరాడు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్ రజాక్ అలియాజ్ రజాక్ (22), నవాబ్సాబ్కుంట ప్రాంతానికి చెందిన హసన్బిన్ అహ్మద్ అలియాస్ ఛావూస్ (31)తో కలిసి ఈ నెల 7న మద్యం మత్తులో ఆటో నడిపిస్తూ, బహదూర్పుర ఫిల్టర్ మీదుగా తాడ్బన్ వైపు వెళ్తున్న దస్తగిరిని వెంబడించిన నిందితులు ఫిల్టర్ వద్ద కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో బుధవారం నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.