కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 3 : స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పును చెల్లించడం లేదని, చెల్లెలితో వివాహం జరిగి రెండేండ్లు అయినా పిల్లలు కావడంలేదని విసుగు చెందిన బావమరిది సొంత బావను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హతమార్చి కటకటాల పాలయ్యారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏసీపీ చంద్రశేఖర్, సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం మాన్యార్వాడీ గ్రామానికి చెందిన అబ్దుల్ అన్వర్ (27) ఆటో డ్రైవర్. 2019లో హఫీజ్పేటకు చెందిన మహిళతో వివాహం కాగా బతుకుదెరువు కోసం హఫీజ్పేటకు వచ్చిన అబ్దుల్ అన్వర్ స్థానికంగా నివాసముండే మహ్మద్ అఖిల్ వద్ద ఆటోను కిరాయికి తీసుకొని రోజుకు రూ.400 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్ వద్ద రూ.1.45 లక్షలు అప్పు చేశాడు.
ఈ అప్పును తీర్చాలని అఖిల్.. భార్య, తల్లి, పెద్దన్న సయ్యద్ అహ్మద్లతో చర్చించారు. ఈనెల 30న కొహీర్ మండలంలో మాన్యార్వాడీలో డబ్బుల విషయంలో పంచాయితీ పెట్టారు. సయ్యద్ అహ్మద్, అఖిల్, అబ్దుల్ అన్వర్ తిరిగి హఫీజ్పేటకు వచ్చారు. తీసుకున్న అప్పును చెల్లించడానికి అన్వర్ వాయిదా వేయడంతో సయ్యద్ అహ్మద్ కోపం పెంచుకున్నాడు. ఈనెల 31న సాయంత్రం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. తర్వాత మహ్మద్ అఖిల్తో కలిసి మళ్లీ తాగారు. ఆటోలో వీరు ముగ్గురు కలిసి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్కు వెళ్లారు. అబ్దుల్ అన్వర్ను మట్టుపెట్టాలని సయ్యద్ అహ్మద్, అఖిల్ నిర్ణయించుకొని స్నేహితుడైన ఇమ్రాన్ సహకారాన్ని కోరారు. వీరు ముగ్గురు కలిసి జూబ్లీహిల్స్ నుంచి బోరబండకు వచ్చారు. మళ్లీ మద్యం తాగి కేపీహెచ్బీ కాలనీ మీదుగా హఫీజ్పేటకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు.
ఈ ముగ్గురితో కలిసి అమీర్ కూడా మద్యం తాగుతూ ఆటోలో వచ్చాడు. కేపీహెచ్బీ కాలనీ ముళ్లకత్వ చెరువు వద్దకు రాగానే ఆటోను ఆపారు. అన్వర్ తలమీద సయ్యద్ అహ్మద్ బీరు బాటిల్తో దాడి చేశాడు. దీనికి అన్వర్ ప్రతిఘటించి రాయితో ఆటో మీదకి వేశాడు. ఈ క్రమంలో సయ్యద్ అహ్మద్, అఖిల్, ఇమ్రాన్లు కలిసి అన్వర్ను బీర్ బాటిళ్లతో పొడవడంతో పాటు అక్కడే ఉన్న టైల్స్ ముక్కతో మెడపై, ఛాతిపై బలంగా పొడిచి హత్యచేసి పారిపోయారు. అబ్దుల్ అన్వర్ సోదరుడు సమ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్ అహ్మద్, ఇమ్రాన్, అఖిల్గా నిర్దారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ హత్య కేసులో భాగస్తులైన ఇమ్రాన్, అఖిల్పై పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.