Hyderabad | హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2024-25 వార్షిక బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనలపై డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన నాలుగు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు.
హైదరాబాద్ ఖ్యాతిని పెంచడం, డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడం, గ్రీన్ అండ్ క్లీన్ సిటీ డెవలప్ చేయడం, మూసీని ప్రక్షాళన చేసిన హైదరాబాద్ షాన్ పెండచమే ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క వివరించారు. హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ దొరికిన చోట కఠినమైన కేసులు నమోదు చేయడంతో వాటు.. వాటికి ఉండే అన్ని రకాల అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. గ్రీన్ అండ్ క్లీన్ సిటిగా మార్చడానికి మురుగు నీటి కాలవలను నిర్మించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, పచ్చదనాన్ని పెంపోందించాలని సూచించారు. చెరువులు ఆక్రమణకు గురైన చోట వాటిని సంరక్షించడానికి అధికార యంత్రాగం అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజలను భాగస్వాములు చేయాలని తెలిపారు. జీహెచ్ఎంసీ అంతర్భాగంలో మూసీ ప్రక్షాళన పనులు జూన్ నాటికి పూర్తి చేసి సుందరీకరణ చేయాలన్నారు. హెచ్ఎండీఏలో ప్రత్యామ్నయ వనరులు పెంచడానికి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్ షిప్ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని సూచించారు. 2031 మాస్టార్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మార్కు చేయాలని సూచించారు. దీని ద్వారా మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఇండ్ల నిర్మాణం చేయకుండా ప్రజల్లో అవగాహన కలుగుతుందన్నారు.