అల్వాల్, జూన్ 2 ః మచ్చబొల్లారం జీఎంటీ గార్డెన్ ఎస్టేట్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. కుటుంబం ఊరెళ్లిన సమయంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక లక్ష నగదు ల్యాప్టాప్తో పాటు బయట పార్కు చేసిన బైక్ను కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. గత నెల 29న కుటుంబంతో కలసి తమిళనాడుకు వెళ్లారు.
మంగళవారం ఉదయం ఇంటి తాళం పగిలి ఉండటాన్ని గమనించి బా ధితుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అ ల్వాల్ సీఐ ప్రశాంత్, డీఐ వీరబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారు నగలు, ల్యాప్టాప్ చోరీ చేశారు. ఇంట్లోని సామాన్లు మొత్తం చిందర వందర చేశారు. పక్క వీధిలో పార్కు చేసిన బైక్ను కూడా తీసుకెళ్లి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.