Hyderabad | బండ్లగూడ, మార్చి 31 : రాజేంద్రనగర్లో మళ్లీ దోపిడీ దొంగల ముఠాలు విరుచుకుపడుతున్నాయి. పట్టపగలు, నడిరోడ్డుపై తమ ప్రతాపం చూపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న ఒక కారును నడిరోడ్డుపై అడ్డుకున్న గుర్తుతెలియని దుండగులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చితకబాది, అతడి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే… సన్సిటీకి చెందిన కన్నయ్యలాల్ స్వీట్షాప్ నిర్వహిస్తాడు. ఆదివారం మధ్యాహ్నం తన కారులో అత్తాపూర్ మీదుగా ప్రయాణిస్తుండగా అతడిని కొంత మంది గుర్తుతెలియని దుండగులు వెంబడించారు. పీవీ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెంబర్ 182 వద్దకు రాగానే, దుండగులు కన్నయ్యలాల్ కారును అడ్డగించారు. దీంతో కారు దిగిన కన్నయ్యలాల్ను హెల్మెట్లతో విచక్షణారహితంగా చితకబాది, అతడి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.
జనాల మధ్యనే జరిగిన ఈదాడి నుంచి తేరుకునేలోపే దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు. నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటనతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల 30న ఉప్పర్పల్లి ప్రాంతంలో ఓ వృద్ధురాలు ఉదయం 6గంటల సమయంలో ఇంటిముందు ముగ్గువేసి లోపలికి వెళ్లగానే గుర్తుతెలియని ఓ మహిళ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై దాడిచేసి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లింది. స్థానికంగా జరుగుతున్న వరుస దోపిడీలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా పోలీసు అధికారులు స్పందించి దోపిడీ దొంగల ముఠాలపై నిఘా పెట్టాలని, పట్టపగలే రోడ్లపై దారిదోపిడీలు జరగకుండా విజుబుల్ పోలీసింగ్తో పాటు పోలీసు గస్తీని పెంచాలని ప్రజలు కోరుతున్నారు.