Hyderabad | సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): ఈ దొంగలు సినిమాలు చూసి దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ అధికారుల మాదిరిగానే గుర్తింపు కార్డులతో సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి.. బంగారం దోచుకుపోయారు. మహారాష్ట్రలో తలదాచుకున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 60 లక్షల విలువజేసే ఏడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కేసు వివరాలను వెల్లడించారు.
నగల దుకాణం నిర్వహిస్తూ స్కెచ్..
నగరానికి చెందిన మహేందర్ బాబా దిల్సుఖ్నగర్లో సిద్ధివినాయక పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన రెండు వర్క్షాప్లలో ఒక వర్క్షాప్ చిక్కడపల్లిలో ఉండగా.. మరొకటి సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో ఉంది. ఈ వర్క్షాప్లలో పాత బంగారాన్ని కరిగించి, ఆభరణాలు లేదా.. ఇతర బంగారు వస్తువులను తయారు చేస్తారు. కాగా, నెల రోజుల కిందట పాట్మార్కెట్లోని హర్షద్ గోల్డ్మెల్టింగ్ షాప్లో పనికి చేరిన మహారాష్ట్రలోని ఖానాపూర్కు చెందిన జాఖీర్ ఘని అత్తర్ కరిగించిన బంగారాన్ని తీసుకుని నగల తయారీ కోసం సిద్దివినాయక గోల్డ్ షాప్నకు వస్తుంటాడు. ఈ క్రమంలో అక్కడ జరిగే కార్యకలాపాలు, బంగారు బిస్కెట్లను చూసిన జాఖీర్ విషయాన్ని తన స్నేహితులు, అనుచరులకు చేరవేశాడు. అంతేకాకుండా ఏదైనా చేసి ఈ బంగారాన్ని తస్కరించాలని పథకం పన్నాడు. తన పథకాన్ని అమలు చేసేందుకు ఖానాపూర్లో ఆరుగురిని, గోవాలో ఉన్న ముగ్గురు పాత నేరస్తులను తోడు చేసుకున్నాడు. వీరంతా జాఖిర్ ఘని స్నేహితులు. బంగారాన్ని దోచుకునేందుకు ఐటీ అధికారులఅవతారమెత్తాలని స్కెచ్ వేశారు.
ఐటీ ఐడీ కార్డులు తయారు చేసి..
ఈ క్రమంలో ఐటీ శాఖ ఐడీ కార్డులు సైతం తయారు చేసుకుని ఈనెల 24న మహారాష్ట్ర ఖానాపూర్కు చెందిన రహ్మాన్ గఫూర్ అత్తర్, ప్రవీణ్ యాదవ్, ఆకాశ్ అరుణ్ హవ్లీ, అభిజిత్ కుమార్ గోడ్కె, అమోల్ గన్పత్రవ్ జాదవ్ కలిసి బస్సులో, గోవాకు చెందిన సిద్దాంత్ అలియాస్ సిదార్థ జాదవ్, సంజయ్ పరశురామ్ జాదవ్, శుభం వినోద్ జాదవ్, అజయ్ వినోద్ జాదవ్ ట్రైన్లో నగరానికి చేరుకున్నారు. వీరంతా కలిసి సికింద్రాబాద్లోని ఢిల్లీ లాడ్జీలో బస చేశారు. బంగారం దుకాణంలో పనిచేసే జాఖీర్ ఘని అత్తర్ సైతం ఢిల్లీ లాడ్జికి వెళ్లి తన స్నేహితులతో దోపిడీకి సంబంధించిన పథకాన్ని వివరించాడు. ఇందులో భాగంగా బాబు, లాలా అనే ఇద్దరు వ్యక్తులను పాట్మార్కెట్కు తీసుకెళ్లి అక్కడున్న సిద్దివినాయక బంగారం దుకాణాని చూపించాడు. పథకం ప్రకారం ఈనెల 27న ఉదయం 11.40గంటల సమయంలో నిందితులంతా కలిసి పాట్ మార్కెట్లోని సిద్ది వినాయక బంగారం దుకాణంలోకి వెళ్లారు. తాము ఐటీ అధికారులమంటూ నకిలీ గుర్తింపు కార్డులను చూపించారు. వెంటనే దుకాణంలో పనిచేసే వారి వద్ద నుంచి సెల్ఫోన్లు లాక్కున్నారు. వారిని ఒక గదిలో బంధించి, వారి వద్ద నుంచి 17 బంగారు బిస్కెట్లను తీసుకుని ఉడాయించారు.
అన్ని కోణాల్లో విచారణ..
ఫిర్యాదు స్వీకరించిన ఉత్తర మండలం డీసీపీ, ఏసీపీ, టాస్క్ఫోర్స్ బృందాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగినట్లు సీపీ వివరించారు. సీసీ టీవీల విశ్లేషణ, బంగారం దుకాణంలో ఎవరెవరు పనిచేస్తున్నారు.. వారి పేర్లు, వివరాలు, ఎవరు వచ్చి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. లభించిన కొన్ని ఆధారాలతో స్థానిక బంగారం దుకాణంలో పనిచేస్తూ, తరచూ సిద్ధి వినాయక బంగారం దుకాణానికి వచ్చే వ్యక్తి ద్వారానే ఈ దోపిడీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు. బంగారం దోపిడీ చేసిన నిందితులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూప్ మహారాష్ట్ర, మరో గ్రూప్ గోవాకు వెళ్లినట్లు గుర్తించామని సీపీ తెలిపారు.
ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, యాక్షన్లో ఉన్నప్పుడే రహ్మాన్, జాఖీర్ ఘని అత్తర్, ప్రవీణ్ యాదవ ఆకాశ్ అరుణ్లను మహారాష్ట్రలోని ఖానాపూర్లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన నిందితుల వివరాలను సేకరించామని, వారి కోసం గోవా, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టుబడిన నలుగురు నిందితుల వద్ద నుంచి రూ.60 లక్షల విలువజేసే 7 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
ఆ రెండు సినిమాలు చూసి….
నిందితులు స్పెషల్-26 (అక్షయ్కుమార్ హీరో), సూర్య గ్యాంగ్ అనే రెండు సినిమాలు చూసి ఈ దోపిడీకి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడించారని సీపీ ఆనంద్ తెలిపారు.
నగర పోలీసుల పనితీరుకు నిదర్శనం..
పాత కాలంలో ఇలాంటి కేసులు చేధించే వీలు ఉండేది కాదన్నారు. క్యూనెట్, జూబ్లీహిల్స్లో గర్భిణిని బెదిరించి దోపిడీ వంటి కేసులు చాలా క్లిష్టమైనవని సీపీ తెలిపారు. ఇలాంటి కేసులు గతంలో డిటెక్ట్ కాకుండానే మిగిలిపోయేవన్నారు. ప్రస్తుతం నగర పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, పనితీరుతో ఇలాంటి క్లిష్టమైన కేసులను సులభంగా చేధిస్తున్నట్లు సీపీ వివరించారు. ఈ సందర్భంగా కేసు చేధించిన పోలీసులకు రివార్డులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.