చెత్త నుంచి నిత్యం వంద మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసే లక్ష్యం వైపు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తున్నది. ఇప్పటికే జవహర్నగర్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ను నెలకొల్పగా, 19.5 మెగావాట్లు ఉన్న ఈ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని 24 మెగా వాట్లకు పెంచారు. ఇక్కడే మరో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఒక్క జవహర్నగర్లోనే మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనున్నది. ఇదే స్ఫూర్తితో నగరం నలువైపులా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా దుండిగల్లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను మార్చినాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో పాటు నగర శివారులోని సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో 15 మెగావాట్లు, యాదాద్రి జిల్లా బీబీనగర్లో 11 మెగావాట్లు, రంగారెడ్డి జిల్లా యాచారంలో 12 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఇవన్నీ ప్రారంభమైతే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ప్రతి రోజూ మొత్తం 100.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నది.
– సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ )
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): చెత్తనుంచి నిత్యం వంద మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జవహర్నగర్లో 19.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయగా.. ఇటీవల ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 24 మెగావాట్లకు పెంచారు. అయితే ఇక్కడే 24 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా మరో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేవలం ఒక్క జవహర్నగర్లోనే మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగనున్నది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 19.5 మెగా వాట్ల ప్లాంటులో రోజుకు సుమారు 1300 టన్నుల నుంచి 1500 టన్నుల వ్యర్థాలను(ఆర్డీఎఫ్) ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 6.35 లక్షల వ్యర్థాలను వినియోగించుకొని 225 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.
ఇందులో భాగంగానే చెత్తతో సంపద సృష్టించేందుకుగాను నగరం నలువైపులా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు దుండిగల్లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయగా.. వచ్చే మార్చి చివరినాటికల్లా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్లాంట్కు ప్రతిరోజు మరో 1000 నుంచి 1200 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం ఉంటుందని తెలిపారు.
చెత్తను నిల్వ ఉంచకుండా..
గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టూ ఉన్న నగరపాలక సంస్థల్లో జనాభా పెరగడమే కాకుండా దినదినాభివృద్ధి విస్తరణ జరుగుతున్న క్రమంలో వ్యర్థాలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజువారీగా సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్, డిస్పోజల్ ద్వారా వినియోగించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా మొత్తం 100.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
రోజూ 7500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
జీహెచ్ఎంసీ ఇతర నగర పాలక సంస్థల నుంచి ప్రతిరోజు సుమారు 7000 నుంచి 7500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియకు ఎకువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చడం, బయో గ్యాస్ తయారు చేయడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం, పొడి చెత్తలో కాలే గుణం గల వ్యర్థాలను పోగు చేసి విద్యుత్ తయారీకి వినియోగిస్తూ.. చెత్తతో సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.