సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డ నేపాలీ పనిమనుషులు దొరికారు.ప్రేమికులైన వీరు..పనిలో చేరి..దోపిడీకి స్కెచ్ వేసి..అందినకాడికి దోచుకెళ్లారు. శనివారం నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.. వారి నుంచి రూ. 68.23 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని టెలికాంకాలనీలో వ్యాపారి గోవింద్రావు ఇంట్లో నేపాల్కు చెందిన లంక బహదూర్ షాహీ అలియాస్ లక్ష్మణ్, ఖడ్కే పవిత్ర అలియాస్ పనా వాచ్మన్గా, వంట మనిషిగా ఐదు నెలలుగా నమ్మకంగా పని చేస్తున్నారు.
అంతకుముందు పని చేసిన యమ్లాల్ నేపాల్కు వెళ్తూ.. ఈ ఇద్దర్నీ ఇక్కడ పనికి పెట్టి వెళ్లిపోయాడు. ఈ నెల 18న గోవింద్రావు కుటుంబం తన స్నేహితుడితో కలిసి శ్రీశైలానికి వెళ్లాడు. ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని ఈ నేపాలీ పనిమనుషులకు చెప్పాడు. ఇదే అవకాశంగా భావించిన లక్ష్మణ్, పవిత్ర ఈనెల 19న తెల్లవారుజామున కిటీకి గ్రిల్ తొలగించి.. లోపలికి ప్రవేశించి బెడ్రూం, కప్బోర్డు తాళాలను పగులగొట్టి.. 1.10 కేజీల బంగారం, రూ.8 లక్షల నగదును చోరీ చేసి కారు బుక్ చేసుకుని నేరుగా సోలాపూర్ వెళ్లారు.
అక్కడి నుంచి పుణె, ఆ తర్వాత ముంబైకి చేరి.. అక్కడ బంగారం విక్రయించి కొద్ది రోజుల పాటు అక్కడే తలదాచుకుందామని పథకం వేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు శుక్రవారం సాయంత్రం సోలాపూర్లో లక్ష్మణ్, పవిత్రలను అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపర్చి.. నగరానికి తీసుకువచ్చి శనివారం అరెస్టు ప్రకటించారు.
నేపాల్ నుంచి వచ్చి సంపన్నుల ఇండ్లల్లో పని చేస్తున్న నేపాలీలు తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు అధికంగా ఫేస్బుక్-మెసెంజర్ కాల్స్ల్లోనే అధికంగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఇంటి పరిసరాలను ఇతర అంశాలను అవతలి వ్యక్తికి చెప్పి సలహాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇలా సంపన్నుల ఇండ్లలో పని చేస్తున్న వారంతా ఆ ఇంట్లో జరిగే వ్యవహారాలను మెసెంజర్ కాల్స్ ద్వారానే చర్చించుకుని దోపిడీలకు స్కెచ్ వేస్తున్నట్లు తెలిసింది.
ఇంట్లో పని చేసేందుకు వ్యక్తులను నియమించుకుంటున్నప్పుడు వారి వివరాలను హాక్-ఐలో నమోదు చేసినా, లేదా పోలీసుల దృష్టికి ఆ వివరాలను తీసుకువచ్చినా వారికి పాత నేర చరిత్ర ఉందా లేదా అనే విషయాలు నిర్ధారించి చెబుతామని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ముఖ్యంగా బయటి దేశాల నుంచి వచ్చే వారిని ఇంటి పనుల కోసం పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకుని వారితో పాటు ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు.
కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కేసులకు సంబంధించి నిర్వహించే మీడియా సమావేశాల్లో ఉన్నతాధికారులు కూర్చుంటారు. రాయదుర్గం చోరీ కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు ఆనంద్కుమార్ గౌడ్, అశోక్, ఆనంద్లను సీపీ తన పక్కనే కూర్చోబెట్టుకుని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అలాగే దొంగలను పట్టుకున్న బృందాలను అభినందించిన సీపీ.. రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణ్, పవిత్ర దంపతులు కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది.లక్ష్మణ్ నేపాల్లో వ్యవసాయ పనులు చేసి.. ఆ తర్వాత ముంబైకి వలస వచ్చాడు. అక్కడ హోటల్స్, ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో పని చేసేవాడు. లక్ష్మణ్కు రీతాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితులతో లక్ష్మణ్ కుటుంబం నేపాల్కు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఫేస్బుక్లో పవిత్ర పరిచయమైంది. ఇలా ఇద్దరు ప్రేమలో పడి.. యమ్లాల్ సహాయంతో హైదరాబాద్కు వచ్చి గోవింద్రావు ఇంట్లో పనిలో చేరారు. అప్పటి నుంచి చోరీకి ప్లాన్ వేసుకుని సమయం కోసం ఎదురు చూశారు. ఇంట్లో గదులు ఊడ్చేటప్పుడు, బూజు దులిపే సమయంలో మొత్తం బంగారం, నగదును ఎక్కడ పెట్టారో పసిగట్టారు.