సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్కు అలవాటుపడి.. డ్రగ్స్ విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకున్న ఒక ముఠాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ నితికా పంత్ కథనం ప్రకారం.. గోల్కొండ సెవన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ, టోలిచౌకి నివాసి అబుబాకర్ బిన్ అబ్దుల్ అజీజ్ స్నేహితులు. ఇద్దరూ డ్రగ్స్కు అలవాటు పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు.
వీరిద్దరి స్నేహితుడైన టోలిచౌకి నివాసి మహ్మద్ ఖాసీంకు రూ.80 వేలు ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్లోని పాడేర్కు పంపించారు. అక్కడ ఖాసీం లీటర్ హాష్ ఆయిల్ను కొనుగోలుచేసి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. ఈ ఆయిల్ను సోమాజిగూడలోని సయ్యద్ ముర్తుజా అలీ ఇంటికి తీసుకువచ్చి.. అక్కడే అడ్డాను ఏర్పాటు చేసుకొని, 5 మిల్లీ లీటర్ల ఆయిల్ను ఒక్కో బాటిల్లో నింపుతున్నారు. ఒక్కో బాటిల్ను రూ.2 వేల చొప్పున సబ్ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నారు.
ఈ ముఠా వద్ద టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాలకు చెందిన సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్, జీషాన్ నవీద్, సయ్యద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ, నితిన్గౌడ్, పూనమ్ కుమారి కౌర్ సబ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ.. హాష్ ఆయిల్ ఒక్కో బాటిల్ను రూ.3 వేలు, చారస్ను అవసరమైన వారికి విక్రయిస్తూ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. విశ్వనీయ సమాచారం మేరకు.. వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ ఫాషా బృందం ఈ ముఠాను అరెస్ట్ చేసింది. ఈ ముఠా నుంచి 310 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్, 70 గ్రాముల చారస్, ఒక ద్విచక్ర వాహనం, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణ బాధ్యతలను ఫిలిమ్నగర్ పోలీసులకు అప్పగించారు.