సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా శుక్రవారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.3,93,500 నగదు సీజ్ చేశారు. ఇప్పటి వరకు రూ. 3,62,40,950 నగదును సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 755 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు.
నాన్బెయిలబుల్ వారంట్ కేసులు 2320, 3371 నక్కాస్ ఆపరేషన్స్, 4573 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. వాహనాల దుర్వినియోగం కింద గోషామహల్ నియోజకవర్గంలో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు. 148 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనపై నగదు తరలింపు
చార్మినార్,నవంబర్ 17 : ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతున్నదని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. దివాన్దేవిడీలో పట్టుబడిన రూ.37 లక్షల వివరాలను వెల్లడించారు. చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలోని దివాన్దేవిడి ప్రాంతంలో చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారని తెలిపారు. బండ్లగూడకు చెందిన మర్రి రాజ్కుమార్, మరోవ్యక్తి అనిల్కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నారని చెప్పారు.
అనిల్ చేతిలో బ్యాగ్ను గుర్తించిన పోలీసులు.. వాహనాన్ని ఆపి డిక్కీని పరిశీలించారని, రూ. 37 లక్షలు లభించాయన్నారు. నగదుకు సంబంధించి ప్రశ్నించగా.. వారినుంచి సరైన సమాధానం రాలేదని డీసీపీ తెలిపారు. దీంతో ఆ నగదును సీజ్ చేసి, ఐటీ శాఖకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ షేక్ జహంగీర్తోపాటు చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్, చార్మినర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఇన్స్పెక్టర్ బాలస్వామితోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.