ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఉద్యోగ భర్తీలో ఎవరికీ అన్యాయం జరగకుండా జీవో నంబర్ 46ను జారీ చేసిందని గుర్తు చేశారు.
కానీ ఆ జీవోపై న్యాయస్థానం విధించిన స్టేను తొలగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభు త్వం వెంటనే స్పందించి, స్టేను తొలగించి, ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10 నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొని సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.