సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నాలుగో రోజు రాష్ట్ర పోలీస్ శాఖ, ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ కార్యక్రమాలు నగర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం ట్యాంక్బండ్ నుంచి చార్మినార్ వరకు, అక్కడి నుంచి సంజీవయ్య పార్కు వరకు పెట్రోల్ మొబైల్, బ్లూకోల్ట్స్, వజ్ర, అగ్నిమాపక శాఖ, క్లూస్ టీమ్ తదితర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం నెక్లస్ రోటరీ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, ఆయుధాలు తదితర అంశాలపై పోలీస్ ఎక్స్ పో నిర్వహించారు. రాత్రి బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఫుట్ పెట్రోలింగ్తో పాటు లేజర్ షోలు నిర్వహించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయం నుంచి ఉప్పల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
సైబరాబాద్ పోలీసులు దుర్గం చెరవు వద్ద డ్రోన్ కెమెరాల షో నిర్వహించారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన సురక్ష దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ కార్యక్రమాలతో పోలీసులు బిజీ బిజీగా గడిపారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్తో పాటు మంత్రి శ్రీనివాస్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ విజయలక్ష్మి, సినీ హీరో నిఖిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని, పోలీస్ శాఖకు తగిన పాధాన్యత ఇచ్చారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖకు రూ. 5400 బడ్జెట్ ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 10 జిల్లాలకే రూ. 9500 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీతో పాటు ఆధునిక వాహనాలను కల్పించారని, వాహనాలకు ఒకేసారి రూ.700 కోట్లు మంజూరు చేసి పోలీస్ వ్యవస్థను ముఖ్యమంత్రి పటిష్ఠం చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను నిర్వహించి, అందులో సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక బ్యూరోలను ప్రారంభించామన్నారు. పోలీసులు ఉపయోగించే టెక్నాలజీ, ఆయుధాలపై దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మొదటిసారిగా పోలీస్ ఎక్స్పో నిర్వహించారని, పోలీసులకు అభినందనలు తెలిపారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో నిర్భయంగా బయట తిరిగే స్వేచ్ఛాయుత వాతావారణం తెలంగాణలో ఉందన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులకు దేశంలోనే కాదు, ఇతర దేశాలలోనూ మంచి గుర్తింపు ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఠాణాలను అత్యాధునికంగా తీర్చిదిద్దడం, ఠాణాలకు వచ్చే వారికి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఠాణాలకు వచ్చే బాధితులతో పోలీసులు మమేకమవుతూ, మేమున్నామని కొండంత అండ ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. పోలీసులు ప్రజలతో కలిసిపోవాలని, పోలీసులకు తగిన వనరులు కల్పించడంతో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయన్నారు. న్యూయార్క్ వంటి నగరాలలోనే అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయని అప్పట్లో వినేవాళ్లం నేడు హైదరాబాద్లో అంతకంటే ఎక్కువగా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. 9 ఏండ్లలో తెలంగాణలో శాంతి భద్రతలు భేష్గా ఉన్నాయని, పోలీసులు బాగా పనిచేయడంతో ప్రభుత్వానికి కూడా మంచిపేరు తెస్తున్నదని అన్నారు.