పీర్జాదిగూడ, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలు బలపడ్డాయన్నారు. మేడిపల్లిలో రూ.78 కోట్లతో సుమారు 60 ఎకరాల స్థలంలో నూతనంగా చేపడుతున్న అధునాతన రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయ నిర్మాణానికి ఆయన మంత్రి మల్లారెడ్డితో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులతో ప్రజలకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు.
ప్రజల రక్షణ, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు పాటుపడుతున్నదని తెలిపారు. మేడిపల్లిలో నిర్మించే రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం గల కార్యాలయం అవుతుందన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. మహిళలకు పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన భవన నిర్మాణాన్ని మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లిలో చేపట్టడం ఆనందంగా ఉన్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ విభాగాలు, ప్రత్యేక పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో మహిళలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మేడిపల్లిలోని సువిశాల ప్రాంతంలో నూతన కమిషనరేట్ భవన నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. మహిళల పట్ల జరిగే నేరాలు, హింసను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దయానంద్, డీసీపీ (ట్రాఫిక్) అభిషేక్ మహంతి, మల్కాజిగిరి జోన్ డీసీపీ జానకీ, సైబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గ దయాకర్రెడ్డి, బోడుప్పల్, జవహర్నగర్ మేయర్లు సామల బుచ్చిరెడ్డి, కావ్య, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.