పీర్జాదిగూడ, జనవరి 22: తల్లి కోసం ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన కోల వెంకట రమణమూర్తి (47)కి అదే ప్రాంతానికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి 14 ఏండ్ల కిందట కుటుంబ సభ్యులను వదిలేసి హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం పీర్జాదిగూడలోని బీబీ సాహెబ్ మక్తాలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇటీవల ఫేస్బుక్లో చూసిన ఆమె కుమారుడు శ్రీకాంత్రెడ్డి ఆచూకీ తెలుసుకొని తల్లిని కలుసుకున్నాడు. రమణమూర్తికి నచ్చజెప్పి తల్లిని స్వగ్రామానికి తీసుకువెళ్లాడు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా రమణమూర్తి తరచూ ఆ మహిళకు, శ్రీకాంత్కు ఫోన్చేసి… హైదరాబాద్కు రమ్మంటూ వేధిస్తున్నాడు. నిత్యం రమణమూర్తి ఫోన్కాల్ వేధింపులు భరించలేక నెల రోజుల కిందటే తల్లిని తీసుకొని హైదరాబాద్కు వచ్చాడు.
14 ఏండ్ల కిందట దూరమైన తల్లిని ఈ మధ్యనే కలిశాను.. రమణమూర్తి వల్ల తిరిగి తన తల్లి దూరమవుతున్నది.. నాతల్లి వద్దే ఉండాలి.. అంటూ శ్రీకాంత్ రమణమూర్తిపై కోపం పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఎలాంటి అనుమానం రాకుండా ఆదివారం మధ్యాహ్నం రమణమూర్తి వద్దకు మద్యం తీసుకువచ్చి సేవించారు. మద్యం మత్తులో ఉన్న రమణమూర్తి తలపై, పక్కటెముకలపై అక్కడున్న 5 కేజీల సిలిండర్తో బలంగా కొట్టాడు. తనవెంట తీసుకెళ్లిన చాకుతో విచక్షణారహితంగా పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో రమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.