సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానంతో కార్మికులు రగిలిపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో శుక్రవారం శంకర్గౌడ్ చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శంకర్ గౌడ్ తన ప్రాణాన్ని అర్పించాడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రీజియన్ల వారీగా అన్ని ఆర్టీసీ జేఏసీలు వారి ఆధ్వర్యంలోని డిపోల ఎదుట శంకర్ గౌడ్ ఫొటోతో కూడిన బ్యానర్తో ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు హన్మంతు, శ్రీనివాస్, రవి మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ ఆత్మహత్యకు రేవంత్ సర్కారే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బస్సులు లేక ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. రేతిఫైల్, జేబీఎస్, ఎంజీబీఎస్, కోఠి బస్టాండ్లలో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు. నడిచే అరకొర అద్దె బస్సులు సైతం ఏ సమయానికి వస్తాయో.. అసలు వస్తాయా రావా అని సమాచారం ఇచ్చే వాళ్లు కూడా బస్టాండ్లలో లేరు. దీంతో చాలా మంది గంటల తరబడి ఎదురుచూసి చివరికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
రేవంత్.. ఎంతమంది చావులు చూస్తవ్?
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదట్నుంచే డ్రైవర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగారని వాహన సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఉచిత బస్సు ప్రవేశపెట్టి తొలుత ఆటో డ్రైవర్లను రోడ్డున పడేశారని, వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని వాహన జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె సందర్భంగా శుక్రవారం ‘నమస్తే’తో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంకెంత మంది డ్రైవర్ల చావులు చూస్తారని విమర్శించారు. ఆటో డ్రైవర్ల చావు అనంతరం ఆర్టీసీ డ్రైవర్లపై కక్ష సాధింపులకు దిగడం శ్రేయస్కరం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా మ్యానిఫెస్టోలో హామీలను రాసుకున్నట్టుగా ఉందని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసి డ్రైవర్లను రోడ్డున పడేయడానికి జరిగే కుట్రను అందరం తిప్పికొడుతామని పేర్కొన్నారు.