Love affair | బంజారాహిల్స్, సెప్టెంబర్ 9: ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కక్షతో యూట్యూబర్గా పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకిస గ్రామానికి చెందిన కె.కార్తీక్ (18) ఇటీవల నగరానికి వచ్చి వెంకటగిరిలోని స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. యూట్యూబ్ వీడియోల్లో డ్యాన్సర్గా పని చేస్తున్న కార్తీక్ గత నెల 13న అదృశ్యమయ్యాడు. దీంతో స్వగ్రామంలో ఉంటున్న అతడి బాబాయ్ వెంకటేష్ గత నెల 16న నగరానికి వచ్చి చూడగా, గది తాళం వేసి కనిపించింది. దాంతో కార్తీక్ కనిపించడం లేదని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కార్తీక్ మిస్సింగ్ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు 100కు పైగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు సెల్ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత నెల 13న రాత్రి కార్తీక్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి బైక్ మీద వెళ్తున్న విషయం తెలిసింది. దారి పొడువునా సీసీ కెమెరాలు పరిశీలించగా ఫతేనగర్ ప్రాంతంలోని ఎయిర్పోర్ట్ వెనక భాగంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లినట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కార్తీక్ అస్తి పంజరం కనిపించింది. అతడి ఒంటిపై దుస్తులతో పాటు ఇతర వస్తువుల ఆధారంగా జూబ్లీహిల్స్లో అదృశ్యమైన కార్తీక్దే ఈ అస్తి పంజరం అని తేలింది.
కార్తీక్ హత్య అయినట్లు తేలడంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. కార్తీక్ స్నేహితులను వాకబు చేయగా, అతడికి ఇటీవల జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ కృష్ణానగర్లో నివాసం ఉంటున్న యువతి(19)తో పరిచయం ఏర్పడిందని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నించగా హత్యకు కారణమైన తోలేటి సాయి(20) అనే యూ ట్యూబర్ గురించి తెలిసింది. సుమారు ఆరునెలల క్రితం సదరు యువతితో సన్నిహితంగా ఉన్న సాయితో బ్రేకప్ చెప్పడం, తర్వాత కొన్నిరోజుల నుంచి కార్తీక్తో సన్నిహితంగా ఉంటుండటంతో కక్ష పెంచుకున్న సాయి అతడిని హత్య చేసినట్లు తేలింది. విజయనగరం జిల్లా రాగోలు గ్రామానికి చెంది న తోలేటి సాయి కూడా యూ ట్యూబ్లో డ్యాన్స్ వీడియోల్లో నటిస్తుంటాడు. ఫిబ్రవరిలో యువతికి దగ్గర య్యాడు. కాగా, అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో సద రు యువతి ఇటీవల కార్తీక్తో సన్నిహితంగా ఉంటోంది. ఇదే క్రమంలో ఈ నెల 13న యువతి గదిలో ఉన్న కార్తీక్ను చూసిన సాయి తన స్నేహితులయిన కొప్పల సురేష్(20), నక్కా జగదీష్(20), మజ్జి రఘు(19) అనే యువకులతో కలిసి అక్కడకొచ్చి గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తనకు పోటీగా ఉన్న కార్తీక్ను ఎలాగైనా హతమార్చాలని సాయి నిర్ణయించుకున్నాడు.
కార్తీక్తో కాసేపు గొడవపడిన సాయి జరిగిన విషయాలను మర్చిపోదామని, సదరు యువతిని నీకే వదిలేస్తున్నానంటూ నమ్మించాడు. ఇద్దరూ కలిసి ఉన్నా తనకు అభ్యంతరం లేదని. అయితే, తనతో కొన్నాళ్ల పాటు బోయిన్పల్లిలోని గదిలో యువతికి సంబంధించిన బట్టలు, ఇతర వస్తువులు తన గదిలోనే ఉన్నాయని, వాటిని తీసుకు వద్దామంటూ కార్తీక్ను నమ్మించాడు. దీంతో సాయితో పాటు మరో ముగ్గురు యువకులతో కలిసి బైక్ల మీద కార్తీక్ బయలు దేరాడు. ఫతేనగర్ దాటిన తర్వాత అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లిన సాయి తదితరులు కత్తితో గొంతు కోశారు. అయితే ప్రాణం పోయిందా? లేదా? అన్న అనుమానంతో బండరాళ్లతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని ముళ్లపొదళ్లో పారవేసి వెళ్లిపోయారు. దీంతో కేసులో నిందితులైన సాయి, సురేశ్, జగదీశ్, రఘులను శనివారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి క్లూస్ లేకున్నా సుమారు 25 రోజుల క్రితం జరిగిన హత్య కేసును అత్యంత చాకచక్యంగా చేధించిన జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, ఎస్ఐలు రాజశేఖర్, రామా నాయుడుతో పాటు జూబ్లీహిల్స్ క్రైం సిబ్బందిని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ప్రత్యేకంగా అభినందించారు.