హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్తో ఫ్యూచర్ సిటీకి, ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని తొర్రూర్ (66 ప్లాట్లు), కుర్మల్గుడ (11), బహదూర్ పల్లి (8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు.
పెద్ద అంబర్పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్హాల్లో నిర్వహించిన వేలంలో పాల్గొన్నబిడ్డర్లు చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేయడం విశేషం. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. తొర్రూర్లో 200 -700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలు నిర్దారించగా, సగటున రూ.32,500 ధర పలికిందన్నారు.
తమకు నచ్చిన భూముల కోసం పోటీ పడుతూ బిడ్డర్లు ఒక దశలో ప్లాట్ను దకించుకోడానికి గజానికి రూ.45,500 వెచ్చించారని పేర్కొన్నారు. కుర్మల్గుడలో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు చదరపు గజం కనీస ధర రూ.20 వేలునిర్ణయించగా, గరిష్టంగా రూ.27,500 ధర పలికింది. ఔటర్రింగ్రోడ్ను ఆనుకుని ఉన్న బహదూర్పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు చదరపు గజం కనీస ధర రూ.27 వేలుగా నిర్ణయించగా, గరిష్టంగా రూ.40,500 ధర పలికిందని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన బహిరంగ వేలం విక్రయాల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది బిడ్డర్లు పాల్గొన్నారని వివరించారు.