మేడ్చల్ /శామీర్పేట/ పీర్జాదిగూడ/ జవహర్నగర్, జూలై 28: దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్, పీర్జాదిగూడ, జవహర్నగర్ తదితర ప్రాంతాల్లో వీధులు వరద నీరు తగ్గలేదు. ఇంకా వీధులు వరద నీటిలో మునిగి ఉన్నాయి. వరద నీటి తొలగింపునకు మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టారు. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువుకు వరద ఉదృతి కొనసాగుతుండటంతో అలుగు పారుతున్నది. చెరువు పై నుంచి వస్తున్న వరద కారణంగా మేడ్చల్-గౌడవెల్లి రహదారిపై రాకపోకల అంతరాయం ఏర్పడింది. అలుగు నుంచి కిందికి వెళ్తున్న నీటి కారణంగా మేడ్చల్-కిష్టాపూర్ దారి ఇంకా తెరుచుకోలేదు. మున్సిపాలిటీకి ఇరువైపులా రోడ్డుకు అడ్డుగా వాహనాలను నిలిపి, ప్రయాణికుల దారి మళ్లించారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని రాఘవేంద్రనగర్లో చేపట్టిన సహాయక చర్యలను కౌన్సిలర్ హరికృష్ణ యాదవ్ పర్యవేక్షించారు. శామీర్పేట పెద్ద చెరువు నిండకుండను తలపిస్తుంది. పై నుంచి వస్తున్న భారీ వరద కారణంగా చెరువు శుక్రవారం అలుగెళ్లింది. ఈ సందర్భంగా కట్ట మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి గ్రామం నుంచి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి, అలుగు వద్ద పూజలు చేశారు.
కార్యక్రమంలో కట్టమైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, జడ్పీటీసీ అనితాలాలయ్య, ఎంపీటీసీ సాయిబాబా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉప సర్పంచ్ రమేశ్ యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. నిండుకుండలా మారిన మేడ్చల్ పెద్ద చెరువును సందర్శించేందుకు నగరం, మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. ఆలియాబాద్-బాబాగూడ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ఆ రోడ్డును నీళ్లలో నుంచి దాటి ప్రమాదాల బారిన పడకుండా కానిస్టేబుల్తో పహా రా ఏర్పాటు చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. ఆ నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం 2, 5, 11, 15, 16, డివిజన్లలో అధికారులు స్థానిక కార్పొరేటర్లు సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని మల్కారం చెరువు నిండి, నిండుకుండలా మారింది. చెన్నాపూర్ నుంచి బీఆజేఆర్నగర్కు వెళ్లే రోడ్డు గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 28: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 15.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మండలంలో 24.3, దుండిగల్లో 19.6, బాచుపల్లిలో 34.2, కుత్బుల్లాపూర్లో 12.0 ,కుకట్పల్లిలో 16.9, బాలానగర్లో 14.4, అల్వల్లో 13.2, మల్కాజిగిరిలో13.7, ఉప్పల్లో 13.9, మేడిపల్లిలో 13.8, కాప్రాలో 12.9, శామీర్పేట్లో 12.2, కీసరలో 13.3, ఘట్కేసర్లో 14.3, మూడుచింతల్పల్లిలో 10.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.