సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. కానీ రైల్వే శాఖ తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా స్టేషన్ విస్తరణ పనులు మొదలు పెట్టామని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే విస్తరణకు అడ్డుగా ఉన్న 90 చెట్లను నరికివేసి, అక్కడి నుంచి తొలిగించారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణలో రైల్వే శాఖ ఘోరంగా వైఫల్యం చెందిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న చెట్లను నరికివేయడాన్ని పలువురు రైల్వే అధికారులు, పర్యావరణ వేత్తలు తప్పుబడుతున్నారు. రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలి? కానీ దాని పేరుతో పచ్చని చెట్లను తొలిగించడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి రైల్వే శాఖ సరైన సమాధానం చెప్పలేక పోతున్నది.
రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం స్టేషన్ పరిధిలో అడ్డుగా ఉన్న 119 చెట్లను తొలిగించడానికి అనుమతివ్వాలని ఎస్సీఆర్ అధికారులు పర్యావరణ శాఖకు దరఖాస్తు చేశారు. ఎలాంటి అనుమతులు రాలేదు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన అటవీ పరిరక్షణ కమిటీ నివేదిక ప్రకారం గత ఏడాది డిసెంబర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించింది. దీంతో స్టేషన్ అభివృద్ధి పేరుతో ఒక్క చెట్టును కూడా నరికివేతకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారు. స్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం 119 చెట్లలో 45 చెట్లను ట్రాన్స్లోకేషన్కు సిఫార్సు చేశారు. మరో 74 చెట్లను అదే స్థలంలో నిలుపుదలకు సిఫార్సు చేశారు. ట్రాన్స్లొకేషన్కు నిర్ణయించిన అన్ని చెట్లకు, మూడు రెట్లు మొక్కలు నాటాలని కూడా కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో రైల్వే అధికారులు, అటవీ అధికారుల పరస్పర కమ్యూనికేషన్లో గందరగోళం ఏర్పడిందని, దీనిపై రైల్వే అధికారులకు సరైన అవగాహన లేక పోవడం వల్ల పచ్చని చెట్లను నరికివేశారన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో చెట్లను నరికివేసే క్రమంలో వాటికి నష్టపరిహారం కింద ప్లాంటేషన్ను పెంచడానికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంది. అందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.94,500 చెల్లించాలని సిఫార్సులో పేర్కొన్నారు. అయినా కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలను రైల్వే శాఖ పాటించకపోవడం గమనార్హం.
సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ మధ్య తనిఖీ
సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ను దక్షిణ మధ్య రైల్వే జోనల్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ వరకు లోకో మోటీవ్ ద్వారా రైల్వే ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు భద్రతకు సంబంధించిన అంశాలపై ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, ఇతర రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.