సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. దీనికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని రహదారుల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండటమే. నాడు సంవత్సరాల తరబడి ఆస్తుల సేకరణ జరిగే ప్రక్రియలో నేడు సమూల మార్పులు జరిగి నిర్ణీత వ్యవధిలో బాధితులకు పరిహారం అందుతున్నది. తద్వారా సకాలంలో ప్రాజెక్టులు పట్టాలెక్కడమే కాదు నిర్ణీత లక్ష్యంలోపు అందుబాటులోకి వస్తున్నాయి.
జిల్లా కలెక్టర్ల పరిధిలో ఉండే భూసేకరణ ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గడిచిన ఏదేండ్లలో 8594 ఆస్తులను సేకరించారు. నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)తో పాటు వంతెనలు, అండర్పాస్లు, లింకు రోడ్లు, మాస్టర్ప్లాన్ అమలు కోసం ఏటా జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతూ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 4వేల కోట్ల విలువైన 1800 టీడీఆర్లను అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పనులకు చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)తోనే ఆస్తుల సేకరణ ముమ్మరంగా జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.