కాప్రా, అక్టోబర్ 28 : యాభై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కాప్రా సర్కిల్ చర్లపల్లిలో ఆ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి హోంమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉప్పల్ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం.కే.బద్రుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి సుమారు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ… అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ముస్లిం మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని బద్రుద్దీన్ పేర్కొన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.