సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 13 నియోజకవర్గాలలో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ చాలా చోట్ల సాయం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,202 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కమిషనరేట్ పరిధిలో 655 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ (పీఎస్ఐఓసీ) నుంచి కమిషనరేట్ పరిధిలో జరిగిన ఎన్నికల తీరును, పోలింగ్ కేంద్రాల వద్దనున్న క్యూఆర్టీ వాహనాలకు అమర్చిన జీఐఎస్ వ్యవస్థ నుంచి రియల్ టైమ్ లొకేషన్ను ఎప్పటికప్పుడు పరిశీలించారు.
గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు, సందీప్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి తదితరులతో కలిసి బాలానగర్ జోన్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ, కుత్బుల్లాపూర్, నిజాంపేట, హఫీజ్పేట్, జగద్గిరిగుట్ట, జీడిమెట్లలోని పలు పోలింగ్ కేంద్రాలు, మాదాపూర్ జోన్ పరిధిలోని మలేషియన్ టౌన్షిప్, నానక్రాంగూడ, గౌలిదొడ్డి, గోపన్పల్లి తాండ తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి, అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
అనంతరం, రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని సిక్చావనిలోని గురునానక్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, హాసన్నగర్లోని లవ్లీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను సీపీ సందర్శించి, అక్కడి పోలింగ్ సరళిని పరిశీలించారు.