బంజారాహిల్స్,మార్చి 15: జూబ్లీహిల్స్లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో నివాసం ఉంటున్న అనిరుధ్రెడ్డి నివాసంలో 45రోజుల క్రితం గార్డెన్లో మాలిగా చేరిన మహేశ్ షాహీ, అతడి భార్య అప్సరా షాహీ శుక్రవారం అర్ధరాత్రి యజమాని ఇంట్లోకి ప్రవేశించి సుమారు రూ.2కోట్ల విలువైన ఆభరణాలు. ఖరీదైన వాచీలు చోరీ చేసి ఉడాయించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా చోరీ ఘటనలో మహేశ్ షాహీ, అప్సరతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలంలో సేకరించిన సీసీ ఫుటేజీతో పాటు ఇతర టెక్నికల్ అంశాల ఆధారంగా చోరీ ఘటన గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. నెలరోజుల క్రితం నందగిరిహిల్స్లో రవీంద్రశర్మ అనే వ్యాపారి ఇంట్లో సైతం ఇదే తరహాలో పనిమనుషుల సాయంతో భారీ చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే.
నందగిరిహిల్స్లో పనిమనిషిగా చేరి చోరీలో పాల్గొన్న భూపేందర్ షాహీకి, జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో అనిరుధ్రెడ్డి ఇంట్లో తోటమాలిగా పనిచేస్తూ చోరీకి పాల్పడిన మహేశ్ షాహీకి మధ్యన లింక్ ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. గతంలో సైఫాబాద్, నందగిరిహిల్స్లో నేపాలీ గ్యాంగ్ను దింపి చోరీకి పాల్పడిన ప్రధాన సూత్రధారి జిబాన్ చాంద్ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పదేళ్లుగా అనిరుధ్రెడ్డి ఇంట్లో పనిచేసిన భార్యాభర్తలు ఊరెళ్లిపోవడంతో 45రోజుల క్రితం ఓ ఏజెంట్ ద్వారా మహేశ్ షాహీ అప్సరా షాహీలు పనిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో వారిని పనిలో పెట్టించిన ఏజెంట్తో పాటు బంధువులు, స్నేహితుల కదలికలపై నిఘా పెట్టారు. కాగా నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే రెండు టాస్క్ఫోర్స్ పోలీస్ బృందాలు నేపాల్ సరిహద్దుకు చేరుకోగా, మరో నాలుగు బృందాలు ముంబై, పుణే తదితర నగరాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.