సుల్తాన్బజార్, జూలై 14 : ఉస్మానియా దవాఖానలోని ప్లాస్టిక్ సర్జరీ సూపర్స్పెషాలిటీ విభాగంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రపంచంలోనే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీని ప్రొఫెసర్ హెరాల్డ్ డెల్ఫ్ గిల్లీస్ తొలిసారిగా పరిచయం చేయగా.. 50 ఏండ్ల కిందట దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా దవాఖానలో ప్రొఫెసర్ డాక్టర్ సి.బాలక్రిష్ణన్ ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించి ఆధ్యుడిగా నిలిచారు. డాక్టర్ ఎల్ఎన్ ప్రసాద్ దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని మరింత విస్తృతం చేశారు. ఏటా వందల సంఖ్యలో క్షతగాత్రులకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్య సేవలు అందజేస్తున్న ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉన్నతాధికారులు పలువురిచే ప్రశంసలందుకుంటున్నారు.
తొలిసారిగా స్కిన్ బ్యాంకు ఏర్పాటు
రోగుల సౌకర్యార్ధం ఉస్మానియాలో తొలిసారిగా స్కిన్ బ్యాంకు ఏర్పాటు చేశారు. మృతదేహాల నుంచి వలిచిన చర్మాన్ని రోగులకు విజయవంతంగా అమర్చడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా పుట్టుకతో వచ్చే చిట్లిన పెదవులు(గ్రహణ మొర్రీ), పెద్ద పుట్టుమచ్చలు, పచ్చబొట్లు, తెల్ల మచ్చలు(బొల్లి)లని తొలగిస్తున్నారు. వీటితో పాటు వంకర చెవులు, ముక్కు సరిచేయుట, చెవి కమ్మల రంధ్రములకు సర్జరీ చేస్తున్నారు. లైపోసెక్షన్ ద్వారా లావు కాళ్ళు, స్థూలకాయం తగ్గిస్తున్నారు. బోధకాలు, మధుమేహం, బట్టతల వంటి రోగులకు కాస్మోటిక్ సర్జరీ చేస్తున్నారు. ఈ ఏడాది చర్మనిధి కేంద్రం ద్వారా ఇప్పటికే అనేక మంది రోగులకు చర్మమార్పిడి చేశారు. మరింత మంది రోగులకు అవసరమైన చర్మాన్ని సేకరించి నిల్వ చేయడంలో ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు నిమగ్నమయ్యారు.
నేడు ఉస్మానియాలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సర్జరీ వేడుకలు
కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల్లో ఎంతో ఖరీదైన వైద్యసేవలను ఉస్మానియా దవాఖానలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. శనివారం దవాఖానలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.