వెంగళరావునగర్, ఫిబ్రవరి 29 : ఇంటి యజమాని అనుమానాస్పదస్థితిలో ప్రమాదానికి గురై చనిపోయింది. చివరి క్షణంలో తన ఇంటి నుంచే అంత్యక్రియలు జరగాలని కోరుకున్నది. ఆమె చనిపోయాక.. కుటుంబసభ్యులు సొంతింటికి మృతదేహాన్ని తీసుకురాగా, కిరాయిదారు అడ్డుకున్నది. ఆమెకు పోలీసులు కూడా వత్తాసు పలకడం విస్మయానికి గురిచేసింది. మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండాపూర్ నివాసి సూరం రమణమ్మ (81) అమీర్పేట వెస్ట్ శ్రీనివాసకాలనీలో ఉన్న తన ఐదంతస్తుల భవనాన్ని 2021, అక్టోబర్ 1న ఓ మహిళకు అద్దెకు ఇచ్చింది. అందులో ఆమె లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నది. కొన్నాళ్లకు అద్దె చెల్లించడం మానేయడంతో తనకు కిరాయి ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయాలని యజమానురాలు కోరుతూ వచ్చింది. ఇంతలో బిల్డింగ్ ఖాళీ చేయకుండా ఉండేందుకు సిటీ సివిల్ కోర్టు నుంచి కిరాయిదారు స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్నది. ఆ తర్వాత స్టేటస్ కో ఆర్డర్ను యజమాని రద్దు చేయించింది. అయినా, కిరాయిదారు భవనం ఖాళీ చేయకపోవడంతో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతున్నది.
ఫిబ్రవరి 11న వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న రమణమ్మను గుర్తుతెలియని వ్యక్తి బైక్తో ఢీకొట్టాడు. ఆమె కాలుకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. తన ఇంటిని ఖాళీ చేయకుండా.. తనను అంతమొందించాలనే కుట్రతో తన కిరాయిదారే రోడ్డు ప్రమాదం చేయించారని రమణమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో తాను చనిపోతే అంత్యక్రియలు ఇంటి నుంచే జరగాలని కుటుంబ సభ్యులను రమణమ్మ కోరింది. గురువారం ఆమె మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చారు.
రమణమ్మ మృతదేహాన్ని ఇంటికి తేగా.. ఇంట్లో అద్దెకు ఉండే కిరాయిదారు, ఆమె భర్త కలిసి అడ్డుకున్నారు. ఇంట్లోకి శవాన్ని రానిచ్చేది లేదంటూ.. గొడవకు దిగారు. తన అమ్మమ్మ మృతదేహాన్ని ఆమె ఇంటికే తెచ్చామని, ఆమె ఇంటికి రాకుండా అడ్డుపడడానికి మీరెవ్వరంటూ.. మృతురాలి మనువడు కిరాయిదారును నిలదీశాడు. ఇంతలో తమ ఇంటి వద్దకు కొందరు వచ్చి గొడవ చేస్తున్నారంటూ కిరాయిదారు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమోద్తో పాటు అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. పోలీసుల చేష్టలతో స్థానికులు, మృతురాలి బంధువులు ఆశ్చర్యపోయారు. ఇంత అన్యాయమా..? అంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలో తమపై దాడి చేశాడంటూ మృతురాలి మనవడు ప్రమోద్పై పోలీసులకు కిరాయిదారు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమోద్తోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్కు తరలించి, వారి వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించారు. ఇందులో భాగంగానే రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన రమణమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ దవాఖానకు తరలించారు. కాగా, రోడ్డు ప్రమాదంతో హత్య చేశారని, కుట్రపూరితంగా ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న క్రమంలో మధురానగర్ పోలీసులు ఎందుకు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించలేదు..అనేది ఆరోపణలకు మరింత బలాన్నిస్తున్నది.
ఇది మా ఇల్లు. నాన్న ఎంతో కష్టపడి ఈ ఇల్లు కట్టారు. అమ్మ చనిపోవడంతో ఆమె మృతదేహం ఉన్న ఫ్రీజర్ బాక్స్ను ఇంటికి తెచ్చుకుంటే మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా కబ్జాదారులు గెంటేశారు. పోలీసుల అండ చూసుకుని కబ్జాదారులు ఇంటి యజమానులైన మాపైనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ ఇంటిని కబ్జా చేసేందుకు పత్రాలపై సంతకాలు చేయాలని మా అమ్మను, మమ్మల్ని కిరాయిదారులు బెదిరించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను మరదలినని.. వరంగల్ డీఐజీ మరదలినని దబాయించారు. తల్లి రమణమ్మను బైక్తో ఢీకొట్టించి చివరకు చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అమ్మని బైక్తో ఢీకొట్టి చంపినవారిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. మా అమ్మ అంత్యక్రియలు చేయడానికి వచ్చిన కొడుకుని కూడాపోలీసులు అదుపులోకి తీసుకుని సెల్ఫోన్లు లాక్కున్నారు. మాకు న్యాయం కావాలి.
బైక్తో ఢీకొట్టి రమణమ్మ ప్రాణాలు పోవడానికి కారణకుడైన నిందితుడ్ని గుర్తించి త్వరలోనే పట్టుకుంటాం. ఆ భవనం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. మేం ఎవరికి వత్తాసు పలకడం లేదు. మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. అవన్ని అవాస్తవాలు. రూ.30 లక్షలు వెచ్చించి లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేసుకున్నట్లు అద్దెకున్న కిరాయిదారులు చెబుతున్నారు. రమణమ్మ మృతదేహం ఇంటి వద్దకు తెచ్చినప్పుడు గొడవ జరుగుతుందన్న సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లి చర్యలు తీసుకున్నారు. రమణమ్మ అంత్యక్రియల ఆమె ఇంటి నుంచే జరుపుకోవచ్చని వాళ్లకు సూచించాం. ఎవరికి ఇబ్బందులు జరగకుండా, గొడవ పడకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సూచించాం. భవనంలోని లేడీస్ హాస్టల్ వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పరదాలు ఏర్పాటు చేయించాం.