తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నగరవ్యాప్తంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు ఇందులో భాగస్వాములయ్యారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఎలా ఆదర్శంగా నిలిచిందో వివరించారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ గస్తీ వాహనాలు, అగ్నిమాపక శకటాలతో నిర్వహించిన ర్యాలీలు, నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ ఎక్స్పో, దుర్గం చెరువు వద్ద డ్రోన్ కెమెరాల షో విశేషంగా ఆకట్టుకున్నాయి.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మాదాపూర్లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం నిర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పది సంవత్సరాల ప్రయాణాన్ని సూచిస్తూ డ్రోన్తో చేసిన ఆకృతులు ఆశ్చర్యపరిచాయి. బీఆర్ అంబేద్కర్ విగ్రహం నమూనాతో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం, సచివాలయం, యాదాద్రి దేవాలయం, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, పోలీసు ఇమేజ్ టవర్స్, షీ టీమ్స్, సైబరాబాద్ పోలీసు లోగోలను డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు.
– కొండాపూర్, జూన్ 4