సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్లో చిరువ్యాపారులపై బల్దియా మరోసారి యుద్ధం ప్రకటించింది. మాది ఆక్రమణ కాదు..ఆకలి కేక..మాకు వెండింగ్ జోన్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్న బాధితుల విజ్ఞప్తులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే గడిచిన కొన్ని వారాలుగా చిరు వ్యాపారులపై బుల్డోజర్లతో జీహెచ్ఎంసీ విరుచుకుపడుతున్నది.
ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, కనీసం సామాన్లు సర్దుకునే అవకాశం ఇవ్వడం లేదంటూ బాధితులు మండిపడుతున్నా.. ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన డ్రైవ్ సమయంలో అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ బల్దియా యంత్రాంగం మాత్రం వెనక్కుతగ్గడం లేదు. శనివారం 8 చోట్ల స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. ఈ మేరకు విజిలెన్స్ విభాగం పోలీసుల సహాయంతో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
