సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ): కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు పర్యావరణంతోపాటు అరుదైన జంతు, వృక్ష సంపదపై కూడా ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. సీసీఎంబీ విభాగానికి చెందిన పరిశోధకులు ప్రధానంగా అరుదైన వృక్ష సంపదను అధ్యయనం చేస్తున్నారు. డా. జాహ్నవి జోషీ బృందం జాతీయ, అంతర్జాతీయ అధ్యయన సంస్థల సహకారంతో వెస్ట్రన్ ఘాట్పై పరిశోధనలు చేస్తున్నారు.
తాజాగా చేసిన పరిశోధనలను ప్రముఖ సైంటిఫిక్ సంస్థ రాయల్ సొసైటీ గుర్తించింది. పశ్చిమ కనుమలు అధిక వైవిధ్యమైన కలప మొకలను కలిగి ఉన్నాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. 60 శాతం పైగా స్థానికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉత్తర పశ్చిమ కనుమల కంటే ఆరు రెట్లు ఎకువ జాతులు ఉన్నాయని అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు.