ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల బర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే యేటా 2 కోట్ల ఉద్యోగాలు బర్తీ చేస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని విమర్శించారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ తదితర రంగాల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఖాళీలను వెంటనే బర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కీలకమైన ఐఎఎస్, ఐపీఎస్ ఉద్యోగాలను సైతం మోడీ ప్రభుత్వం బర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని, రిజర్వేషన్ లు అమలు చేయాల్సి వస్తుందనే కుట్రతోనే ఉద్యోగాలను బర్తీ చేయడం లేదని మండిపడ్డారు. లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీ, రైల్వే రంగాలను ప్రైవేటు పరం చేయడం ప్రజలు క్షమించరని, కేంద్ర ప్రభుత్వ చర్యలు పేద, మధ్య తరగతి ప్రజలకు విఘాతం కలిగించేలా పరిణమిస్తున్నాయని అన్నారు.
అన్ని ప్రైవేటు పరం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి మంత్రులు ఎందుకని ప్రశ్నించిన ఆయన మంత్రి వర్గాన్ని ప్రైవేటు పరం చేయాలని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కారుకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఒక పక్క రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే మరోపక్క ఉన్న ఉద్యోగులకు తొలగిస్తుందని ఆరోపించారు.
పేదలపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని ఉపసంహ రించుకొని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల బర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు.
గత యేడాది 1820 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల బర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినా వర్శిటీల పాలకమండళ్లు జాప్యం చేస్తున్నాయని అన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జిల్లపల్లి అంజి, బబ్లుగౌడ్, ప్రభాకర్, బ్రహ్మయ్య, రాజ్యలక్ష్మీ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.