హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో పరిశీలించారు. ఈనెల 17 వ తేదీన నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం, ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరాపార్కు వద్ద గల NTR స్టేడియంలో పర్యటించారు. హైదరాబాద్ లో 17 వ తేదీన పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా NTR స్టేడియం వరకు ఊరేగింపు గా చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రులు వెల్లడించారు.
ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్ల ను మంత్రులు నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో కలసి పర్యవేక్షించారు. అనంతరం మంత్రులు , ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లు పై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన పై చర్చించారు.
అనంతరం సీఎం కేసీఆర్ పాల్గొనే సభలో నిర్వహించే సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను ఆదేశించారు.
కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.