నగరాన్ని వాన వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరవాసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నది. ప్రాణ నష్టం జరుగకుండా, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నది. నీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, మ్యాన్హోళ్లు పొంగిపొర్లడం వంటి ఫిర్యాదులపై బల్దియా తక్షణం స్పందించి.. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తున్నది. పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు వంటివి నిరంతరాయంగా కొనసాగిస్తున్నది. దెబ్బతిన్న రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నది. అలాగే అన్ని శాఖల అధికారులు కార్యాలయాలు వదిలి క్షేత్రస్థాయిలోనే పనిచేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తూ.. బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. మేమున్నాం.. అధైర్యపడొద్దని అభయమిస్తున్నారు. గురువారం మంత్రి కేటీఆర్ హుస్సేన్ సాగర్లో వరద పరిస్థితిని, మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనల వద్ద మూసీ ఉధృతిని పరిశీలించారు. బల్దియా కంట్రోల్ రూమ్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సందర్శించి.. ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మీర్పేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బాలాల మంత్రి కేటీఆర్ వెంట పర్యటించగా, ఎమ్మెల్యేలు గాంధీ, ముఠాగోపాల్, బేతి సుభాష్రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు.
65 శాతం అధికంగా..
ఈ సీజన్లో సాధారణం కంటే 65% ఎక్కువ వర్షపాతం నమోదైంది. వాన ముంచెత్తినా.. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలతో ముప్పు తప్పింది.
సిటీబ్యూరో, జూలై 27 ( నమస్తే తెలంగాణ) / నమస్తే నెట్వర్క్ : ఓ వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగరానికి సవాల్ విసురుతుంటే.. అంతే దీటుగా తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా 24 గంటలు విధుల్లోనే ఉంటూ అన్ని శాఖల సమన్వయంతో అధికారులు చర్యలు చేపట్టేల ప్రభుత్వం సూచనలు చేసింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాల్లో పర్యటించి వరద ముంపు ప్రభావాన్ని తెలుసుకుంటున్నారు. సురక్షిత చర్యలపై మంత్రి కేటీఆర్ సూచనలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు నగరంలో పర్యటిస్తూ నిరంతర సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేల జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి చర్యలు తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో ఉన్నాయి. ఒకే దగ్గర నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రత్యేక స్టాటిక్ బృందాలు పనిచేస్తున్నాయి. మరోవైపు నగర వాసుల ఫిర్యాదులపై తక్షణ స్పందిస్తున్నారు. ఎర్రజెండాలు, హెచ్చరిక బోర్డులతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందున జీహెచ్ఎంసీ సహాయక చర్యలను మరింత వేగిరం చేసింది.
నిమిషాల వ్యవధిలోనే సహాయక చర్యలు
ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్లతో పాటు సర్కిల్ -17 పరిధిలోని ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్ల పరిధిలో 6 మాన్సూన్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. 45 ప్రాంతాలను వాటర్ లాగింగ్ పాయింట్స్గా గుర్తించారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆయా ప్రాంతాలవద్ద రెయిన్ వాటర్ క్యాచ్పిట్స్లో అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసి వరదనీటిని తోడేస్తూ.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు అందే అన్ని ఫిర్యాదులను తక్షణమే వైర్లెస్ సెట్స్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడంతో నిమిషాల వ్యవధిలోనే సహాయక చర్యలను ప్రారంభించేలా చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారి కోసం మూడు ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ముంపు సమస్యలు తలెత్తకుండా
ఫతేనగర్, దీన్దయాల్నగర్, అల్లాపూర్, రాజీవ్గాంధీనగర్, బాలాజీనగర్లోని రంగధాముని చెరువు నాలా, మూసాపేట మెట్రో స్టేషన్ ప్రాంతాలను ఎమ్మెల్యే కృష్ణారావు సందర్శించారు. ముంపు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ముంపు సమస్యలు, అందిస్తున్న అత్యవసర సేవలపై ఆరా తీస్తున్నారు. కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో వరద ముంపు సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, జోనల్ కమిషనర్ వి.మమత ఆరా తీశారు. రంగధాముని చెరువుకింద మూసాపేట మెట్రో స్టేషన్ కింద నిలుస్తున్న నీటికి కారణాలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అంతరాయంలేకుండా విద్యుత్ సరఫరా
మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చినుకుపడితే విద్యుత్ సరఫరా నిలిచిపోయేదని గుర్తుచేసుకుంటున్నారు. ఎక్కడైనా అనుకోకుండా విద్యుత్ స్తంభాలు పడిపోతే నిమిషాల్లోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతభారీ స్థాయిలో వర్షం పడుతున్నా ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకపోవడం విశేషం.
ప్రజలతో ప్రకాశ్ గౌడ్..
రాజేంద్రనగర్ పట్టణ పరిధిలోని ఐదు డివిజన్లలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తంగా చేశారు. ఆరాంఘర్ చౌరస్తా ప్రాంతంలో వర్షాల దాటికి కొట్టుకుపోయిన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండి పొంగుతుండగా.. జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెన్వాగు, వెంకటేశ్వరకాలనీ పక్కన ఉన్న కాలువ పక్కన నివాసముండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షపునీరు నెక్నాంపూర్ చెరువులోకి తరలివెళ్లేలా మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో రహదారులపై నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. శంషాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లోనూ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్లు, ప్రధాన రహదారిపై పడిన గుంతలను అధికారులు మట్టితో పూడ్చి వేశారు.
పర్యటించి.. పరిష్కరించి..!
సనత్నగర్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలైన బేగంపేట్ డివిజన్లోని ప్రకాశ్నగర్, మయూరిమార్గ్, అల్లంతోట బావి, బ్రాహ్మణవాడి, వడ్డెర బస్తీ, రాంగోపాల్పేట్లోని నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో స్థానికులకు వర్షం నీటి ఇబ్బందులు తలెత్తకుండా బేగంపేట్ సర్కిల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సహాయక బృందాలు గత ఐదు రోజులుగా బస్తీల్లో, కాలనీల్లో పర్యటిస్తూ వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు తగిన సహాయక చర్యలు తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశాల మేరకు కార్పొరేటర్లు బస్తీ వాసులతో మమేకమవుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు గాంధీ భరోసా..!!
భారీ వర్షాల నేపథ్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్, దోవా కాలనీలలో జడ్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ గురువారం పర్యటించారు. అక్కడి నాలా ఔట్ లెట్ మరమ్మతు పనులను పరిశీలించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలాల పటిష్టతకు చర్యలు తీసుకున్నామని, అయినా పరిసర ప్రాంత వాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలనీలు ముంపునకు గురికాకుండా అత్యవసర సహాయక బృందాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, తమ కాలనీలలో ఎటువంటి అత్యవసర పరిస్థితులున్నా తక్షణమే స్థానిక ప్రజా ప్రతినిధులకు, వార్డు కార్యాలయాలకు, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. భారీ వర్షాలతో వచ్చే సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
నిరంతర పర్యవేక్షణలో మంత్రి సబితారెడ్డి
బడంగ్పేట, మీర్పేట, జల్పల్లి, తుక్కుగూడ ప్రాంతాలలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రజలు ఎక్కడ కూడా వర్షాల కారణంగా ఇబ్బందులు పడకుండా అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా సమస్యలు తలెత్తకుండా అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడైతే పురాతన భవనాలు ఉన్నాయో వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల్లో ఎక్కడ కూడా లోటు పాట్లు జరగకుండా ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లు కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు.
బస్తీ ప్రజలకు భరోసా..
గాంధీనగర్ డివిజన్లోని అరుంధీనగర్ బస్తీలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ఇరిగేషన్ శాఖ ఈఈ శంకర్, ఏఈ శ్యామ్ సుందర్, జీహెచ్ఎంసీ డీఈ గీత, ఏఈ అబ్దుల్ సలామ్ లతో కలిసి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గోపాల్ తెలిపారు. హుస్సేన్ సాగర్ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పరివాహక బస్తీ ప్రజలకు వరద ముప్పు తప్పిందన్నారు. అరుంధీనగర్లో నెలకొన్న వరదనీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పురాతన భవనాలపై నజర్..!
జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలో శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను గుర్తించి వాటి తొలగింపు పక్రియను వేగవంతం చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్లు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో మరింత దూకుడు పెంచారు. మరమ్మతులు చేస్తే సరిపోయే భవనాలకు నోటీసులు అందజేయడం.. పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాల యజమానులకు పలుమార్లు హెచ్చరికలను జారీ చేసి ప్రమాదకరమైన స్థాయిలో ఉంటే వాటిని తొలగించే పనులు చేపడుతున్నారు.
మూడు షిప్టుల్లో సహాయక సిబ్బంది
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పరిస్థితిని సమీక్షించేందుకు మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి గురువారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక సేవలు అందించడానికి సిబ్బందిని మూడు షిప్టులుగా విభజించి ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. అవసరమైతే కంట్రోల్ రూం 040-27215959నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు.
రహదారులపై నీటి తొలగింపు..
ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, డీఆర్ఏఫ్ సిబ్బంది పర్యటించి పలు చర్యలు తీసుకున్నారు. మలక్పేట అక్బర్బాగ్ అక్షయ్ టిఫెన్ సెంటర్ వద్ద మలక్పేట-దిల్సుఖ్నగర్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన వరదనీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. పాతమలక్పేట, సైదాబాద్ శంకేశ్వరబజార్లో ఓపెన్ నాలాలోని వ్యర్థాలను, సింగరేణి ఆఫీసర్ కాలనీలో రోడ్లపై నిలిచిపోయిన వరదనీటి జీహెచ్ఎంసీ, డీఆర్ఏఫ్ సిబ్బంది తొలగించారు. స్థానికంగా రోడ్లపై వరదనీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటూనే.. రోడ్లపై ఉన్న ఇసుక దిబ్బలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఏఫ్ సిబ్బంది చేపట్టిన పనులను ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
24 గంటల పాటూ..
భారీ వర్షాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం 24 గంటల పాటు పనిచేస్తున్నది. వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. మూసీ వరదను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. వర్షాలు తగ్గు ముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో వరద ప్రభావం కొంత తగ్గింది.
-మంత్రి కేటీఆర్
ఎస్ఎన్డీపీతో ఉపశమనం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సరూర్నగర్ చెరువు దిగువ ప్రాంతం గడ్డిఅన్నారం డివిజన్లోని కాలనీలు, నాగోలు డివిజన్లో బండ్లగూడ చెరువు పక్కన ఉన్న అయ్యప్పకాలనీ సహా కొన్ని కాలనీలు, హస్తినాపురం ప్రాంతం, లింగోజిగూడ డివిజన్, చంపాపేట డివిజన్, మన్సూరాబాద్ డివిజన్లోని పల్లపు ప్రాంతాల్లో వరదనీరు ఇండ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. సమగ్ర నాలా అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టిన పనులు 80 శాతం పూర్తవ్వడంతో కాస్తా ప్రజలకు ఉపశమనం లభించింది.
– ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్