Hyderabad | సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)లో మొదటిసారి పట్టుబడి కౌన్సెలింగ్కు హాజరైన వారి మైండ్సెట్ మారుతున్నది. మరోసారి మద్యం తాగి డ్రైవింగ్ చేయమంటూ తమకు తాముగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. డీడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపించడం, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనల్లో కౌన్సెలింగ్కు తప్పని సరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ శిక్షణ కేంద్రాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఆయా ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 400 మంది హాజరవుతుంటారు. ఈ కౌన్సెలింగ్లో 45 నిమిషాల పాటు ట్రాఫిక్ నిబంధనలు ఏమి చెబుతున్నాయి.. నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగే నష్టం.. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు.. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి.. లేని వారికి తేడా ఏమిటీ.. వంటి తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా దృశ్య ప్రదర్శన ద్వారా ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
హాజరైన వారిలో మార్పు..
డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదమని ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలను వాహనదారుల కోసం నిర్వహిస్తున్నారు. చాలా మందిలో మార్పు కనిపిస్తున్నది. కౌన్సెలింగ్కు హాజరైన వారిలో చాలా మంది మద్యం మత్తులో వాహనాలు నడిపించడంలేదు. క్యాబ్లల్లో, తాత్కాలికంగా డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఈ మార్పు చాలా మందిలో రావడంలేదు. కొందరు మద్యం సేవించి రోడ్డుపైకి వస్తున్నారు. ఇలాంటి వారిలో మార్పును ఆశిస్తూ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచిస్తున్నారు. దీంతో వాహనదారులు కౌన్సెలింగ్కు హాజరవుతున్నారు. కౌన్సెలింగ్ తర్వాత మరోసారి తాగమంటూ ప్రమాణాలు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తాగేందుకు బయటకు ఎందుకు వెళ్తున్నారు.. ఇంటిలోనే తాగండి.. అంటూ కుటుంబసభ్యులు సైతం సూచిస్తున్నారు.
రెండోసారి చాలా తక్కువ
డీడీలో మొదటిసారి పట్టుబడ్డ వారు.. రెండోసారి పట్టుబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒకసారి కౌన్సెలింగ్కు హాజరై, ఆ తరువాత కోర్టుకు కూడా హాజరైన వారు రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అత్యల్పంగా 0.2 శాతం మాత్రం రెండోసారి పట్టుబడుతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రెండోసారి డీడీలో పట్టుబడితే తప్పనిసరిగా వారివెంట కుటుంబసభ్యులను కూడా కౌన్సెలింగ్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇకనుంచి మద్యం తాగి వాహనం నడపము, ఇతరులను కూడా నడపనివ్వము.. అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
నిబంధనలు పాటిస్తున్నారు సుధీర్బాబు, ట్రాఫిక్ అదనపు సీపీ
నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు. తీసుకుంటున్న కార్యక్రమాలతో చాలా మందిలో మార్పు కనిపిస్తున్నది. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా డీడీపై ఫోకస్ పెడుతున్నాం. డీడీలో పట్టుబడ్డ వారు తప్పని సరిగా కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్తో చాలామంది తమ మైండ్సెట్ను మార్చుకుంటున్నారు. మరోసారి మద్యం తాగి రోడ్డు ఎక్కకుండా స్వీయ క్రమ శిక్షణతో మెలుగుతున్నారు.