మేడ్చల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగును మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విజయవంతం చేయాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగును ప్రారంభించి చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 27,51,810 మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 79 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, ఇది ఎంతో మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్కేభవన్ నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మల్లారెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగ్యస్త, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.